బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ అనూహ్య విజయం సాధించింది. 188 పరుగులు విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 112 పరుగులకే ఆలౌట్ కావడంతో కోహ్లీ సేన 75 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ విజయంతో 4 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది. పూణె వేదికగా జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించిన సంగతి తెలిసిందే.
కాగా ఆస్ట్రేలియాతో జరిగిన సెకండ్ టెస్ట్ మ్యాచ్లో అశ్విన్ రికార్డు సాధించాడు. ఈ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్లో 188 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన ఆసిస్ జట్టును కేవలం 12.4 ఓవర్లలోనే అశ్విన్ ఆరు వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. తద్వారా 25వ సారి ఐదు వికెట్లు పడగొట్టిన బౌలర్గా అవతరించాడు. అయితే మొత్తంగా తొమ్మిదో స్థానంలో ఉండగా భారత ఆటగాళ్లలో హర్భజన్తో కలిసి రెండో స్థానంలో ఉన్నాడు. కుంబ్లే 35 సార్లు టెస్టుల్లో ఐదు వికెట్లు తీసి టాప్లో ఉన్నాడు. ఈ రికార్డును అశ్విన్ బ్రేక్ చేశాడు. కానీ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు ఐదు వికెట్లు తీసి అందరికంటే టాప్లో ఉన్నాడు.
ఇదిలా ఉంటే.. బెంగళూరు టెస్టులో భారత్ గెలవడంపై సోషల్ మీడియా రచ్చ రచ్చ సాగుతోంది. టీమిండియా క్రికెటర్ల ఆటతీరుపై వారివారికి తోచిన విధంగా స్పందిస్తున్నారు. ఆస్ట్రేలియా-భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్లో భారత్ ఓడిపోతుందనుకున్న సమయంలో బౌలర్లు సత్తా చాటడంతో అనూహ్యంగా కోహ్లీ సేన విజయం సాధించింది. భారత్ విజయం సాధించడమే ఆలస్యం.. నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తూ టీమిండియాను ఆకాశానికెత్తారు.