ఐసీసీ టీ20 ప్రపంచ కప్ : పాకిస్థాన్‌ను "సూపర్"గా దెబ్బకొట్టిన అమెరికా భారతీయులు

వరుణ్

శుక్రవారం, 7 జూన్ 2024 (10:44 IST)
ఐసీసీ టీ20 ప్రపంచ కప్ పోటీల్లో పాకిస్థాన్ జట్టు మరోమారు చిత్తయింది. అగ్రరాజ్యం అమెరికా జట్టు చేతిలో ఘోరంగా ఓడిపోయింది. డల్లాస్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీ20 వరల్డ్  కప్ టైటిల్ ఫేవరేట్లలో ఒకటైన పాకిస్థాన్ జట్టుకు క్రికెట్ పసికూన అమెరికా తేరుకోలేని షాకిచ్చింది. సునాయాసంగా గెలుస్తామని భావించిన మ్యాచ్‌ను యూఎస్ సూపర్ ఓవర్ వరకు తీసుకెళ్లి సంచలన విజయం సాధించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన పోరు(సూపర్ ఓవర్)లో ఆతిథ్య జట్టు చారిత్రక విజయం సాధించింది. మహమ్మద్ అమీర్ వేసిన సూపర్ ఓవర్లో అమెరికా ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులకు పరిమితమైంది. టీ20ల్లో పాకిస్థాన్‌పై అమెరికాకు ఇదే తొలి విజయం. ఇక్కడో ముఖ్య విషయం ఏమిటంటే.. పాకిస్థాన్ ఓడిపోవడానికి ప్రధాన కారణం అమెరికా జట్టులోని భారతీయ క్రికెటర్లే. కెప్టెన్ మోనాక్ పట్లే (50) బ్యాట్‌తో అదరగొట్టగా, బౌలింగ్‌లో సౌరభ్ నేత్రావల్కర్ రాణించాడు. ఫలితంగా పాక్ జట్టు తలవంచక తప్పలేదు. 
 
అంతకుముందు టాస్ కోల్పోయి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులకే పరిమితమైంది. ఆ జట్టు బ్యాటర్లలో కెప్టెన్ బాబర్ ఆజమ్ (44), షాదాబ్ ఖాన్ (40) రాణించారు. ఆఖరులో ఆ జట్టు స్టార్ పేసర్ షహీన్ షా ఆఫ్రిది (16 బంతుల్లో 23 నాటౌట్) మెరుపులతో పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. రిజ్వాన్ (9), ఉస్మానాఖాన్ (3) ఫకర్ జమాన్ (11), అజమ్ ఖాన్ (0) ఘోరంగా విఫలమయ్యారు. అమెరికా బౌలర్లు సమిష్టిగా రాణించి పాకిస్థానన్ను కట్టడి చేశారు. 
 
అనంతరం 160 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన యూఎస్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి సరిగ్గా 159 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది. అమెరికా బ్యాటర్లలో ఓపెనర్ మోనాక్ పటేల్ అర్థశతకం (50)తో రాణించాడు. అలాగే అరోన్ జోన్స్ (36 నాటౌట్), అండ్రిస్ గౌస్(35) పరుగులు చేశారు. పాక్ బౌలర్లలో అమిర్, నసీమ్, రవూఫ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక సూపర్ ఓవర్‌లో యూఎస్ ఒక వికెట్ కోల్పోయి 18 పరుగులు చేయగా, ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన పాక్ వికెట్ కోల్పోయి 13 పరుగులకు పరిమితమైంది. దీంతో యూఎస్ఏ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. హాఫ్ సెంచరీతో రాణించిన అమెరికా సారధి మోనాక్ పటేలు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు