ఆస్ట్రేలియాపై సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ సేన ఘనవిజయం సాధించినప్పటికీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ర్యాంక్ మూడో స్థానానికి దిగజారింది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్ బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో కోహ్లీ ఒక స్థానాన్ని కోల్పోయాడు. రెండో స్థానం నుంచి మూడుకు వచ్చాడు. దీంతో అంతకుముందు మూడో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ రెండుకు ఎగబాకాడు. అయితే వీరిద్దరి మధ్య కేవలం ఒక్క పాయింట్ మాత్రమే.
936 పాయింట్లతో టాప్లో ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్లలో కోహ్లీ అత్యల్ప స్కోర్లకే ఔట్ కావడంతోనే ర్యాంకింగ్పై తీవ్ర ప్రభావం చూపింది. మరోవైపు... అశ్విన్, జడేజా టెస్టుల్లో అగ్రస్థానాన్ని పంచుకున్నారు. 2008 తర్వాత మళ్లీ టెస్టుల్లో ఇద్దరు బౌలర్లు నెంబర్ వన్ స్థానంలో నిలిచారు.
ఇకపోతే.. ఆస్ట్రేలియా జట్టులోకి మిచెల్ మార్ష్ స్థానంలో మార్కస్ స్టొయినిస్ రానున్నాడు. భుజం గాయం తిరగబెట్టడంతో ఆల్రౌండర్ మార్ష్ స్వదేశం వెళ్లిపోతున్నాడు. అతని స్థానంలో మరో ఆల్ రౌండర్ మార్కస్ జట్టులోకి తీసుకున్నారు. మార్కస్ మూడు వన్డేలు, రెండు టీ20లు ఆడాడు. గత నెలలో ఛాపెల్-హ్యాడ్లీ సిరీస్లో న్యూజిలాండ్పై 146 పరుగులు సాధించి అందరి దృష్టిని ఆకర్షించాడు.