పాకిస్థాన్‌పై అజేయ శతకం.. వన్డే ర్యాంకింగ్స్ టాప్-5లోకి దూసుకొచ్చిన కోహ్లి

ఠాగూర్

బుధవారం, 26 ఫిబ్రవరి 2025 (17:48 IST)
అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజాగా వన్డే ర్యాంకులను ప్రకటించింది. ఇందులో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ఒక్కసారిగా టాప్-5 స్థానంలోకి దూసుకొచ్చాడు. దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌పై అజేయంగా సెంచరీ చేయడంతో కోహ్లి ర్యాంకు ఒక్కసారిగా పెరిగింది. మొత్తం 743 రేటింగ్ పాయింట్స్‌తో కోహ్లి ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. 
 
అలాగే, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ 757 రేటింగ్ పాయింట్స్‌తో మూడో స్థానంలో నిలిచాడు. మరో భారత బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ తొమ్మిదో ర్యాంకులో ఉన్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉన్న శుభమన్ గిల్ 817 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ జాబితాలో టాప్-10లో నాలుగు స్థానాల్లో భారత ఆటగాళ్లు కొనసాగుతుండటం గమనార్హం. 
 
ఇకపోతే, బౌలింగ్ విభాగంలో శ్రీలంక స్పిన్నర్ మహేశ్ తీక్షణ మొదటి ర్యాంకులో ఉంటే రషీద్ ఖాన్, కుల్దీప్ యాదవ్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతున్నాడు. ఇక మహ్మద్ షమీ ఒక స్థానం మెరుగుపరుచుకుని 14వ ర్యాంకులో, మహ్మద్ సిరాజ్ రెండు స్థానాలు దిగజారి 12వ స్థానానికి చేరుకున్నాడు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు