ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్లో హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ పరాజయాల పరంపరను కొనసాగిస్తోంది. నాగపూర్లో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన 36వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్ రెండు పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో గెలుపు అంచుకు వెళ్లిన డెక్కన్ ఛార్జర్స్ మళ్లీ పరాజయం పాలైంది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ ఆటగాళ్లలో షేన్ వాట్సన్ (58: 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో, రాజస్థాన్ 19.5 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రాజస్థాన్ నిర్ధేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జర్స్ 18.5 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది.
డెక్కన్ ఛార్జర్స్ ఆటగాళ్లలో రోహిత్ శర్మ (73: 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్)లు ఒంటి చేత్తో జట్టును ఆదుకున్నా ఫలితం లేకపోయింది. ఇక కెప్టెన్ గిల్క్రిస్ట్ (34: 17 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా ధీటుగా రాణించలేకపోయాడు. ఫలితంగా చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో డెక్కన్ ఛార్జర్స్ ఓటమిని రుచి చూడాల్సి వచ్చింది.
ఇకపోతే.. డెక్కన్ బౌలర్లలో ఆర్పీ సింగ్ మూడు వికెట్లు పడగొట్టగా, హర్మీత్ సింగ్, హారిస్లు చెరో రెండు వికెట్లు సాధించగా, స్మిత్, ఓజాలో చెరో ఒక వికెట్ను తమ ఖాతాలో వేసుకున్నారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో షేన్వార్న్ నాలుగు, త్రివేది మూడు వికెట్లు తీసుకున్నారు. కాగా డోలె రెండు వికెట్లు సాధించాడు.