ఐపీఎల్-3 సెమీస్ బెర్త్: బెంగళూరుతో డీసీ ఢీ రేపే!

PTI
ఇండియన్ ప్రీమియర్ లీగ్ మూడో సీజన్ సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకునేందుకుగాను హైదరాబాదీ ఫ్రాంచైజీ జట్టు డెక్కన్ ఛార్జర్స్ సోమవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. సెమీఫైనల్‌కు రెండు మ్యాచ్‌ల దూరంలో ఉన్న డెక్కన్ ఛార్జర్స్, 46వ ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌లో బెంగళూరుపై నెగ్గాల్సిన అవసరం ఉంది.

నాగపూర్‌ వేదికగా జరిగే ఈ కీలక మ్యాచ్‌లో ఐపీఎల్ పట్టికలో రెండో స్థానంలో ఉన్న బెంగళూరుతో డెక్కన్ ఛార్జర్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

మరోవైపు ఐపీఎల్ పట్టికలో టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వెనక్కి నెట్టేందుకు బెంగళూరు సాయశక్తులా ప్రయత్నిస్తోంది. దీనికోసం సోమవారం డెక్కన్ ఛార్జర్స్‌తో జరిగే మ్యాచ్‌లో నెగ్గాలని తహతహలాడుతోంది.

ఇందులో భాగంగా.. పది పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్న డెక్కన్ ఛార్జర్స్‌పై నెగ్గాలని బెంగళూరు భావిస్తోంది. కానీ రెండు వరుస విజయాలతో జోరుమీదున్న డెక్కన్ ఛార్జర్స్ కూడా బెంగళూరుపై ఆధిపత్యం చెలాయించే ఆస్కారం ఉందని క్రీడా విశ్లేషకుల అంచనా.

ఇదిలా ఉంటే.. బెంగళూరుతో 12 పాయింట్లను పంచుకుంటూ.. మూడో స్థానానికి దిగజారిన ఢిల్లీ డేర్‌డెవిల్స్.. తన 45వ లీగ్ మ్యాచ్‌లో (ఆదివారం) కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో పోటీపడుతోంది.

వెబ్దునియా పై చదవండి