గంగూలీ లేకుండా కేకేఆర్ లేదు: షారుఖ్

బుధవారం, 1 ఏప్రియల్ 2009 (09:50 IST)
FileFILE
బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ లేకుండా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) లేదని ఆ జట్టు యజమాని, ప్రముఖ బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ స్పష్టం చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్‌లో గంగూలీని పక్కనబెట్టాలని అనుకుంటున్నట్లు వినిపిస్తున్న ఊహాగానాలను షారుఖ్ ఖండించాడు.

కేకేఆర్ జట్టు కోచ్ జాన్ బుచానన్ ఐపీఎల్ రెండో సీజన్‌లో కేకేఆర్‌కు నలుగురైదుగురు కెప్టెన్లు ఉంటారని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త ప్రతిపాదనతో టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పాత్రను జట్టులో పరిమితం చేయాలనుకుంటున్నట్లు మీడియాలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో షారుఖ్ మాట్లాడుతూ.. గంగులీ లేకుండా కేకేఆర్ జట్టే లేదని స్పష్టం చేశారు.

కోచ్ బుచానన్ ప్రకటించిన నలుగురైదుగురు కెప్టెన్ల ప్రతిపాదనను గంగూలీని పక్కనబెట్టే ఉద్దేశంతో తెరపైకి తేలేదని వివరించారు. బుచానన్ కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే జట్టు కెప్టెన్సీని గంగూలీ.. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్ మెక్‌కలమ్, వెస్టిండీస్ కెప్టెన్ క్రిస్ గేల్, దేశీయ ఆటగాడు లక్ష్మీ రతన శుక్లాలతో పంచుకోవాల్సి ఉంటుంది.

అయితే ఇది కేవలం ప్రయోగం మాత్రమేనని, గంగూలీ లేకుండా కేకేఆర్ ఉండదని షారుఖ్ చెప్పారు. మేమందరం గంగూలీని అభిమానిస్తున్నాము. మేము అంతా జట్టు సభ్యులం. ఏ ఒక్కరి ఇష్టం ప్రకారమో నిర్ణయాలు తీసుకోలేదని వివరించారు. ట్వంటీ- 20 కొత్త తరహా క్రికెట్. ఇందులో కొత్త అంశాలను ప్రయత్నిస్తున్నారు.

ఒక్క మ్యాచ్‌లోనే నలుగురు కెప్టెన్లు ఉండబోరు. ఒక్కో మ్యాచ్‌కు ఒక్కో కెప్టెన్ మాత్రమే ఉంటాడు. ఇదిలా ఉంటే ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ వచ్చే నెల 18న దక్షిణాఫ్రికాలో ప్రారంభం కానుంది. భద్రతాపరమైన కారణాలతో ఐపీఎల్‌ను నిర్వాహకులు దక్షిణాఫ్రికాకు తరలించిన సంగతి తెలిసిందే.

వెబ్దునియా పై చదవండి