దక్షిణాఫ్రికా చేతిలో ప్రపంచ నంబర్వన్ ఆస్ట్రేలియా ఓటమిపాలైంది. సెంచూరియన్ పార్కు మైదానంలో ఆదివారం జరిగిన రెండో వన్డేలో ఆతిథ్య దక్షిణాఫ్రికా జట్టు జయకేతనం ఎగురవేసింది. దీంతో ఐదు వన్డేల సిరీస్లో ఇప్పటి వరకు జరిగిన రెండు వన్డే మ్యాచ్లలో ఇరు జట్లు తలా ఒక్కో మ్యాచ్ను గెలుచుకున్నాయి. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు సఫారీల ఫాస్ట్ బౌలింగ్ ముందు తలవంచక తప్పలేదు.
స్పీడ్గన్ డేల్ స్టెయిన్, పార్నెల్లు ఆస్ట్రేలియన్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరి ధాటికి ఆస్ట్రేలియా జట్టు కేవలం 40.2 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటైంది. స్టెయిన్ (4/27), పార్నెల్ (4/25) జోరుకు ఎనిమిది మంది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు రెండంకెల స్కోరు కూడా చేయలేక పోయారు.
ఫెర్గూసన్ మాత్రమే స్పీడ్ బౌలింగ్ను ధీటుగా ఎదుర్కొని అర్థ సెంచరీ పూర్తి చేయగా, జాన్సన్ 30 పరుగులతో రాణించాడు. తర్వాత స్వల్ప విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 3 వికెట్లు కోల్పోయి 26.2 ఓవర్లలోనే 132 పరుగులు చేసి విజయం సాధించారు. కెప్టెన్ స్మిత్ (40), డివిలియర్స్ (36) రాణించగా, ఆసీస్ బౌలర్ జాన్సన్ 2 వికెట్లు తీశాడు.