న్యూజిలాండ్... టీం ఇండియాలు బుధవారం మొదటి ట్వంటీ20 మ్యాచ్లో తలపడనున్నాయి. ఇరు జట్లూ తమ బలగాలను విజయం కోసం సన్నద్ధం చేసుకుని రేపటి మ్యాచ్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. కాగా, కివీస్ పర్యటనలో టీం ఇండియా రెండు ట్వంటీ మ్యాచ్లు, ఐదు వన్డేలు, మూడు టెస్ట్ మ్యాచ్లను ఆడనున్న సంగతి తెలిసిందే.
ఇటీవల జరిగిన శ్రీలంక పర్యటనలో వరుస విజయాలను నమోదు చేసుకున్న టీం ఇండియా, అక్కడ జరిగిన ఒకే ఒక్క ట్వంటీ20 మ్యాచ్లో కూడా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రస్తుతం జరగబోయే ట్వంటీ20లో కూడా టీం ఇండియా హాట్ ఫేవరేట్గా బరిలో దిగుతోంది.
గాయం కారణంగా లంక పర్యటన నుంచి తప్పుకుని, విశ్రాంతి తీసుకున్న స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ తిరిగీ జట్టులో చేరాడు. దీంతో హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ఓజా, ఆల్రౌండర్ రవీంద్ర జడేజాలకు అవకాశం దక్కే సూచనలు కనిపించడం లేదు. ఇక కివీస్ విషయానికి వస్తే... గత కొంత కాలంగా గాయం కారణంగా జట్టుకు దూరంగా ఉన్న, జాకబ్ ఓరమ్ తిరిగి జట్టులోకి రావడంతో ఆ జట్టు బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉంది.