లండన్‌ వేదికకు "టీం ఇండియా" ఓకే

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రెండో సీజన్ వేదిక లండన్ అయితే బాగుంటుందని టీం ఇండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. త్వరలో జరిగే ట్వంటీ- 20 ప్రపంచకప్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే.

ఈ టోర్నీని దృష్టిలో ఉంచుకొని అక్కడి పరిస్థితులకు అలవాటు పడేందుకు ఐపీఎల్‌కు కూడా లండన్ వేదికను ఎంపిక చేస్తే బాగుటుందని టీం ఇండియా ఆటగాళ్లు అభిప్రాయపడ్డారు. ఐసీసీ ట్వంటీ- 20 ప్రపంచకప్ జూన్ 5 నుంచి 21 వరకు ఇంగ్లాండ్‌లో జరగనున్న సంగతి తెలిసిందే.

ఐపీఎల్‌ను లండన్‌లో నిర్వహించడం వలన ప్రపంచకప్‌కు సిద్ధమయ్యేందుకు టీం ఇండియా ఆటగాళ్లకు ఉపయోగపడుతుందని జట్టు బౌలింగ్ కోచ్ వెంకటేశ్ ప్రసాద్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే టీం ఇండియా కోచ్ గ్యారీ కిర్‌స్టన్ తన స్వదేశం (దక్షిణాఫ్రికా)లో ప్రపంచకప్ నిర్ణయాత్మక దశకు చేరుకునే మే నెలలో చలి తీవ్రంగా ఉంటుందన్నాడు.

ఐపీఎల్ రెండో సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అసిస్టెంట్ కోచ్‌గా చేరుతున్నారు. బీసీసీఐ వర్కింగ్ కమిటీ ఆదివారం ఐపీఎల్ రెండో సీజన్‌ను భద్రతాపరమైన సమస్యల కారణంగా విదేశాలకు తరలిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఐపీఎల్ వేదికలుగా దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ దేశాలను పరిశీలిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీం ఇండియా ఆటగాళ్లు కూడా ఇంగ్లాండ్‌‍కు ఓటేయడం ప్రాధాన్యత సంతరించుకోనుంది. మరో రెండు, మూడు రోజుల్లో ఐపీఎల్ కొత్త వేదికను బీసీసీఐ ఖరారు చేయనుంది.

వెబ్దునియా పై చదవండి