తటస్థ వేదిక అబుదాబిలో పాకిస్థాన్తో జరుగనున్న వన్డే సిరీస్ కోసం ఆస్ట్రేలియా జట్టును ప్రకటించారు. వివాదాస్పద క్రికెటర్ ఆండ్రూ సైమండ్స్, గాయం నుంచి కోలుకున్న ఫాస్ట్బౌలర్ బ్రెట్లీలకు ఆసీస్ జట్టులో చోటు కల్పించారు. అయితే, ఆ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్కు మాత్రం సెలక్టర్లు విశ్రాంతి కల్పిస్తూ, జట్టులోకి ఎంపిక చేయలేదు. నాయకత్వ బాధ్యతలను మైఖేల్ క్లార్క్కు అప్పగించారు. కాగా, ఈ సిరీస్ ఏప్రిల్ 22వ తేదీ నుంచి ఆరంభం కానుంది.
ఇందుకోసం క్రికెట్ ఆస్ట్రేలియా సెలక్టర్లు జట్టును ఎంపిక చేశారు. జట్టు రెగ్యులర్ కెప్టెన్ రికీ పాంటింగ్, మైఖేల్ హుస్సే, పేసర్ మిచెల్ జాన్సన్లను ఎంపిక చేయలేదు. యాషెస్ సిరీస్, ఐసీసీ ప్రపంచ ట్వంటీ-20 ఛాంపియన్షిప్ టోర్నీని దృష్టిలో ఉంచుకుని వీరిని జట్టులోకి ఎంపిక చేయలేదని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రతినిధులు వివరణ ఇచ్చారు.
కాగా, ఈ వన్డే సిరీస్కు ఆసీస్ జట్టు బాధ్యతలను మైఖేల్ క్లార్క్ నిర్వహిస్తాడు. వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ బ్రాడ్ హిడ్డన్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడని సీఏ ప్రకటించింది. ఈ ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్తో సహా ఒక ట్వంటీ-20 మ్యాచ్ను ఆస్ట్రేలియా జట్టు పాక్తో ఆడుతుంది.