కరేబియన్ గడ్డపై ఈ నెలాఖరున ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ట్వంటీ-20 ప్రపంచకప్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఆడితే బాగుండేదని టీం ఇండియా స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ట్వంటీ-20 వరల్డ్ కప్ కోసం ఆడే టీం ఇండియా జట్టులో సచిన్ స్థానం సంపాదించి ఉంటే.. క్రికెటర్లకు ఎంతో ఉత్సాహంగా ఉండేదని భజ్జీ చెప్పాడు.
2007వ సంవత్సరం జరిగిన ట్వంటీ-20 ప్రపంచకప్లో సచిన్ టెండూల్కర్ ఆడాడని, కానీ ఆ టోర్నమెంట్లో తాను పాల్గొనలేకపోయాయని భజ్జీ చెప్పుకొచ్చాడు. మొదటి నుంచే సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్లో ఆడాలని ఆకాంక్షిస్తున్న భజ్జీ.. వరల్డ్ కప్లో పాల్గొనాల్సిందిగా ఇటీవల మాస్టర్ను కోరాడు. కానీ మాస్టర్ అందుకు నిరాకరించడంతో భజ్జీ ఒకింత నిరుత్సాహానికి గురైయ్యాడు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరపున సచిన్, భజ్జీలు ఐపీఎల్లో ఆడుతున్నారు.
ఈ నేపథ్యంలో సూపర్ ఫామ్లో ఉన్న సచిన్ టెండూల్కర్ వరల్డ్ కప్లో ఆడితే బాగుంటుందని భజ్జీ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అలాగే సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్లో ఆడాలని నిర్ణయించి ఉంటే అదే జట్టుకు ప్రత్యేక బలాన్ని ఇచ్చి ఉంటుందని వెల్లడించాడు. కానీ టెస్టు, వన్డేల్లో మాత్రమే ఆడుతానని సచిన్ ముందుగా తీసుకున్న నిర్ణయానికే కట్టుబడి ఉన్నాడని భజ్జీ తెలిపాడు. కాగా భజ్జీతో పాటు సచిన్ ప్రపంచకప్లో ఆడాలని మాజీ క్రికెటర్లు నవ్జ్యోత్ సింగ్, సునీల్ గవాస్కర్లు ఆశిస్తున్నారు.