శశి థరూర్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పటినుంచి తొలిసారిగా మీడియా ముందుకొచ్చిన సునంద పుష్కర్.. తాను థరూర్కు ప్రతినిధిని కానని స్పష్టం చేశారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ఆమె విరుచుకుపడ్డారు. కాగా.. థరూర్ వ్యవహారంలో తనను ఇరికించిన మీడియాను సునంద ఈ సందర్భంగా తప్పుబట్టారు.
బుధవారం ఒక వార్తా సంస్థతో సునంద పుష్కర్ మాట్లాడుతూ.. తన వృత్తిపరమైన జీవితాన్ని, అంతర్జాతీయంగా తాను సాధించిన వ్యాపార అనుభవాన్ని పక్కనబెట్టి.. కేవలం తన వ్యక్తిగత జీవితంమీద లేనిపోని ఊహాగానాలను అల్లటం ఎంతమేరకు సబబని ఆమె ఆరోపించారు. వృత్తిపరంగా, ఆర్థికంగా విజయాలను సాధించే సమర్థత ఒక మహిళకు ఉండకూడదా..? అంటూ ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.
వ్యాపారపరంగా తనవద్ద తగినన్ని ఆస్తులు ఉన్నాయనీ, థరూర్కు తనను ప్రతినిధిగా మీడియా చిత్రీకరించటం ఓ మహిళగా తనకు ఘోరమైన అవమానకరమని సునంద ఆవేదన చెందారు. ఒక వితంతువుగా, ఓ బిడ్డకు తల్లిగా తాను ఇప్పటిదాకా విజయవంతమైన కెరీర్ను నిర్మించుకున్నానని ఆమె వివరించారు. అయితే అవాస్తవాలతో, తప్పుడు కథనాలతో మీడియా తనను ఓ కేరికేచర్గా చిత్రీకరించిందని సునంద విలపించారు.
కేరళ ఐపీఎల్ జట్టు ఫ్రాంచైజీ చుట్టూ తిరుగుతున్న వివాదంలో తన పాత్ర ఏమిటో నేరుగా చెప్పాలని ఈ సందర్భంగా సునంద పుష్కర్ డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ సునందను మూడో వివాహం చేసుకోనున్నారనీ, ఇందులో భాగంగా ఐపీఎల్ కొచ్చి జట్టులో ఆమెకు భాగస్వామ్యం కల్పించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మోడీకి క్షమాపణ చెప్పాలని లేకపోతే చంపేస్తామని దావూద్ ముఠా ఆయనకు ఎస్ఎంఎస్లతో హెచ్చరికలు చేస్తున్న సంగతి పాఠకులకు తెలిసిందే.