"లలిత్ మోడీకి క్షమాపణ చెప్పు. కొచ్చి ఐపీఎల్ జట్టునుంచి వైదొలగు. లేదంటే చంపేస్తాం" అంటూ మాఫియా గ్యాంగ్ దావూద్ ఇబ్రహీం కంపెనీకి చెందిన చోటా షకీల్ ఓ ఎస్ఎంఎస్ ద్వారా భారత విదేశాంగ శాఖ సహాయమంత్రి శశిథరూర్కు హెచ్చరికలు జారీ చేస్తూ వార్నింగ్ ఇచ్చాడు.
విదేశాంగ సహాయ మంత్రి కార్యాలయం ద్వారా దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ ఈ ఎస్ఎమ్ఎస్ హెచ్చరికలను జారీ చేసింది. దీంతో భయాందోళనకు గురైన శశి థరూర్, తనకు భద్రతను మరింతగా పెంచాలంటూ కేంద్ర హోంశాఖకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఇదిలా ఉంటే.. తాను మూడో పెళ్లి చేసుకోబోతున్న సునంద పుష్కర్ అనే మహిళకు కొచ్చి ఏపీఎల్ టీమ్లో శశిథరూర్ ఉచితంగా భాగస్వామ్యం కల్పించాడు. దీంతో ఈ విషయాన్ని ఐపీఎల్ ఛైర్మన్ లలిత్ మోడీ వెలుగులోకి తీసుకురావటంతో థరూర్కు పదవీగండం ఏర్పడింది.
మరోవైపు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడిన మంత్రి శశిథరూర్ను వెంటనే మంత్రిపదవి నుంచి దించేయాలని భారతీయ జనతాపార్టీ డిమాండ్ చేసింది. ఐపీఎల్ జట్టును కొనేందుకు సునందకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయని బీజేపీ ప్రశ్నించింది. అలాగే ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది.
అయితే ఈ వ్యవహారంపై అటు మోడీ, ఇటు కాంగ్రెస్ నేతలు నోరు మెదపటంలేదు. పైగా వివాదాన్నంతా బీసీసీఐ చూసుకుంటుంది కాబట్టి, మౌనంగా ఉండాలని బీజేపీకి కాంగ్రెస్ సూచిస్తోంది. అయితే థరూర్ వ్యవహారం మాత్రం రోజు రోజుకు కొత్తమలుపు తిరుగుతోంది. మోడీ మౌనంగా ఉన్నప్పటికీ.. దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ మోడీకి క్షమాపణ చెప్పాలని, లేకపోతే చంపేస్తామని బెదిరించటంతో ఈ వివాదం మరెన్ని మలుపులు తిరుగుతుందోనని పలువురు అభిప్రాయపడుతున్నారు.