వరలక్ష్మీదేవి పూజకు అన్నీ సిద్ధం చేసుకుని ... అంతలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య

శనివారం, 26 ఆగస్టు 2023 (11:31 IST)
శుక్రవారం వరలక్ష్మీదేవి పూజను ఘనంగా చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అంతలో ఏమైందో ఏమోగానీ.. ఆ కుటుంబ సభ్యులు పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. భార్యాభర్తలతో పాటు వారి కుమార్తె పురుగుల మందు తాగారు. వీరిలో భార్యాభర్తలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉంది. విశాఖపట్టణం జిల్లా పెందుర్తి మండలం గొరపల్లి గ్రామంలో ఈ విషాద ఘటన జరిగింది. 
 
పోలీసుల కథనం మేరకు.. కల్లూరి సత్తిబాబు(57) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. ఈయనకు భార్య సూర్యకుమారి(48), కుమార్తె నీలిమ(24), కుమారుడు సంతోష్ కుమార్ ఉన్నారు. సంతోష కుమార్ నగరంలోని ఓ ప్రైవేట్ బ్యాంకులో పని చేస్తుంటారు. కుమార్తె నీలిమ డిగ్రీ పూర్తిచేసి ఇంటి వద్దే ఉంటున్నారు. సత్తిబాబు కుటుంబ అవసరాలు, వ్యాపారం కోసం ఇటీవల పలుచోట్ల అప్పులు చేశారు. వాటిని తీర్చడంలో జాప్యం జరిగింది. ఆ క్రమంలో రుణదాతలు ఒత్తిడి తీవ్రం చేశారు. 
 
ఈ నేపథ్యంలో గురువారం రాత్రి 11 గంటలు దాటిన తర్వాత సత్తిబాబు, ఆయన భార్య సూర్యకుమారి, కుమార్తె నీలిమ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. సూర్యకుమారి గ్రామంలోనే ఉంటున్న వారి బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపారు. వారు గ్రామస్థులతో కలిసి అక్కడికి చేరుకుని ముగ్గురినీ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ సత్తిబాబు శుక్రవారం ఉదయం మృతి చెందగా, మధ్యాహ్నం భార్య సూర్యకుమారి మరణించారు. కుమార్తె నీలిమ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన జరిగిన సమయంలో సంతోషకుమార్ ఇంటి వద్ద లేరు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు