బెంగుళూరు నగరంలోని మడివాళలో ఉన్న ప్రముఖ లాడ్జీలో తన ప్రియురాలితో కలిసి గత ఎనిమిది రోజులుగా ఉంటూ వచ్చిన ఈ యువకుడు శవమైన కనిపించాడు. అతనితో పాటు ఉన్న ప్రియురాలు కనిపించకుండా పోవడం ఇపుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
దక్షిణ కన్నడ జిల్లా పుత్తూరుకు చెందిన తక్షిత్, విరాజపేటకు చెందిన అతని ప్రియురాలు (20) ఎనిమిది రోజుల క్రితం లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. వీరిద్దరూ తమిళనాడులోని పణంబూరులో ఒకే కళాశాలలో బీబీఎం చదువుతున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు సిద్ధం కావాలని, స్నేహితుల ఇంట్లో ఉండి చదువుకుంటామని ఇళ్లలో అబద్ధం చెప్పి బెంగళూరుకు వచ్చారు. లాడ్జిలో దిగిన నాటి నుంచి ఆహారం, కాఫీ వంటివి తమ గదికే తెప్పించుకునేవారు.
గత గురువారం రాత్రి ఫుడ్ పాయిజనింగ్ అయిందని చెప్పి ఇద్దరూ మెడికల్ షాపు నుంచి మందులు తెచ్చుకుని వాడినట్లు తెలిసింది. ఆ తర్వాత శుక్రవారం ఉదయం నుంచి వారి గది తలుపులు తెరుచుకోలేదు. శనివారం గది నుంచి తీవ్ర దుర్వాసన వస్తుండటంతో అనుమానం వచ్చిన లాడ్జి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి బలవంతంగా తలుపులు తెరిచి చూడగా, మంచంపై తక్షిత్ మృతదేహం కనిపించింది.