కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందనీ తల్లిదండ్రుల బలవన్మరణం

శుక్రవారం, 8 అక్టోబరు 2021 (08:57 IST)
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లల జీవితమే తమ సరస్వంగా భావిస్తుంటారు. పిల్లలతో ఎన్నో ఆశలు పెట్టుకుని జీవిస్తుంటారు. అలాంటి పిల్లలు ఒక్క చిన్న తప్పు చేసినా తల్లిదండ్రులు తట్టుకోలేరు. తాజా అల్లారుముద్దుగా పెంచిన కుమార్తె ప్రేమ పెళ్లి చేసుకుందని తెలుసుకున్న తల్లిదండ్రులు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాదకర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని ఊత్తుకోట సమీపం మాంబేడు గ్రామానికి చెందిన తామరై సెల్వన్‌ (60), సరళ (55) అనే భార్యాభర్తలు నివసిస్తున్నారు. వీరి కుమార్తె అర్చన చెన్నై వేప్పేరి ప్రైవేటు ఆస్పత్రిలో దంతవైద్యురాలిగా పని చేస్తుంది. 
 
అయితే, గత నెల 27వ తేదీన అర్చన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఓ యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ విషయం తెలుసుకుని ఆ వృద్ధదంపతులు కుంగిపోయారు. తమ కుమార్తె చేసిన పనిని జీర్ణించుకోలేక పోయారు. ఈక్రమంలో గురువారం ఉదయం తామరై సెల్వన్‌ బజారుకు వెళ్ళి ఇంటికి తిరిగొచ్చి చూడగా భార్య సరళ ఉరిపోసుకుని వేలాడుతుండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. 
 
భార్య ఆత్మహత్యతో మరింత విరక్తి చెందిన తామరై సెల్వన్‌ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా సేపటివరకు ఆ ఇంటి నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో పక్కింటి వారు ఆ ఇంటిలోపలకు వెళ్ళి చూశారు. దంపతులు విగతజీవులుగా కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఊత్తుకోట పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు