మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ మహిళా వైద్యురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో సరికొత్త అంశం వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఎస్ఐ తనపై అత్యాచారం చేశాడని, మరో పోలీస్ తనను మానసికంగా వేధించినట్టు ఆ మహిళా వైద్యురాలు తన అరచేతిలో రాసుకుని ప్రాణాలుతీసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని బీద్ జిల్లాకు చెందిన వైద్యురాలు సతారాలోని ఫల్టాన్ ప్రాంతంలో గల ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. గురువారం రాత్రి ఆమె ఫల్టాన్లోని ఓ హోటల్ గదిలో ఉరికి వేలాడుతూ కన్పించారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలోనే మృతురాలి అరచేతిపై ఓ నోట్ రాసి ఉండటాన్ని గుర్తించారు.
సతారా పోలీసు విభాగానికి చెందిన ఇద్దరు పోలీసులు గత ఐదు నెలలుగా తనను వేధిస్తున్నారని మృతురాలు ఆ నోట్లో పేర్కొన్నారు. ఎస్ఐ గోపాల్ బదానే పలుమార్లు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, మరో పోలీసు ప్రశాంత్ బంకర్ మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సూసైడ్ నోట్లో పేర్కొన్న ఆరోపణల ఆధారంగా దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
ఈ ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై మహారాష్ట్ర మహిళా కమిషన్ చీఫ్ రూపాలీ స్పందించారు. దీనిపై దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ జోక్యం చేసుకుని సతారా ఎస్పీతో మాట్లాడారు. తక్షణమే ఆ ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు.