స్పీడు పెంచిన నవ్యాంధ్ర సీఎం... రెండింటిపైన పట్టుబిగిస్తున్న జగన్

శనివారం, 22 జూన్ 2019 (11:45 IST)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్ మోహన్ రెడ్డి స్పీడు పెంచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రెండో ముఖ్యమంత్రిగా వైఎస్. జగన్మోహన్ రెడ్డి మే నెల 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుంచి ఆయన స్పీడు పెంచారు. అన్ని శాఖలతో సమీక్షా సమావేశాలు నిర్వహించారు. నవ్యాంధ్ర పోలీస్ బాస్‌గా నిజాయితీపరుడైన గౌతం సవాంగ్‌ను ఎంపిక చేసి పోలీసు శాఖను ప్రక్షాళన చేసే దిశగా ముందుకుసాగుతున్నారు. 
 
అలాగే, అన్ని శాఖల కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులను బదిలీ చేస్తున్నారు. పలు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను ఇప్పటికే బదిలీ చేసిన జగన్... శుక్రవారం రాత్రి మరో 47 మంది ఐఏఎస్ అధికారులపై బదిలీ చేశారు. వివిధ హోదాల్లో పనిచేస్తున్న అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం అర్థరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.  సాంఘిక సంక్షేమశాఖ కార్యదర్శిగా మద్దాడ రవిచంద్రను నియమించగా, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శిగా ముకేశ్ కుమార్ మీనాను నియమించింది.
 
అలాగే, ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ ఎండీగా వాణీమోహన్, కార్మిక శాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ఎండీగా భానుప్రకాశ్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్‌గా హెచ్.అరుణ్ కుమార్, ఏపీ టూరిజం అథారిటీ ఎండీగా ప్రవీణ్ కుమార్, విపత్తు నిర్వహణశాఖ స్పెషల్ కమిషనర్‌గా కె.కన్నబాబు, పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శిగా బుడితి రాజశేఖర్, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శిగా వై.మధుసూదన్‌రెడ్డికి పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. అలాగే, మరికొన్ని కీలక శాఖల కార్యదర్శులను కూడా బదిలీ చేసింది. తద్వారా ఆయా ప్రభుత్వ శాఖలపై ఆయన పట్టుసాధిస్తున్నారు. 
 
మరోవైపు, పార్టీపైనా కూడా పట్టు మరింతగా బిగిస్తున్నారు. మంత్రిపదవులు దక్కక అలకబూనిని నేతలను బుజ్జగిస్తూ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులను కట్టబెడుతున్నారు. ఇలాంటివారిలో నగరి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆర్కే. రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా నియమించనున్నారు. అలాగే, మంత్రిపదవి ఆశించిన పెనమలూరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పార్థసారథిని కూడా బుజ్జగిస్తున్నారు. ఈయనకు ప్రభుత్వ విప్ పదవిని జగన్ ఆఫర్ చేయగా ఆయన నిరాకరించారు. 
 
మరోవైపు, మంగళగిరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పై గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డికి జగన్ ఇచ్చిన మంత్రి పదవి హామీని నెరవేర్చలేకపోయారు. దీంతో ఆయన్ను సీఆర్డీఏ ఛైర్మన్ పదవిలో కూర్చోబెట్టనున్నారు. ఇందుకోసం చట్ట సవరణ కూడా చేయనున్నారు. అదేవిధంగా మంత్రిపదవి దక్కలేదని అలకబూనిని కాకాని గోవర్ధన్ రెడ్డిని జగన్ బుజ్జగిస్తున్నారు. మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్ స్వయంగా వివరించారు. ఇలా పార్టీపైనా, అటు ప్రభుత్వంపైనా పట్టు బిగిస్తూ జెట్ స్పీడ్ వేగంతో ముందుకు దూసుకెళుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు