పచ్చిపాలు తాగడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. పచ్చిపాలకు ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, గర్భిణులు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు. ఇటీవల చేసిన ఒక అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. పచ్చిపాలు తాగడం వల్ల ఆహారానికి సంబంధించిన విషతుల్యమైన బాక్టీరియా కడుపులోకి వెళ్లి తీవ్ర దుష్పరిణామాలు సంభవిస్తాయని ఈ పరిశోధనలో తేలింది.
పచ్చిపాలు తాగడం వల్ల నీళ్ల విరేచనాలు, వాంతులు, కడుపులో పోట్లు, జ్వరం, కొన్నిసార్లు మూత్ర పిండాలు దెబ్బతిని హఠాన్మరణం కూడా సంభవించవచ్చని ఈ అధ్యయనం పేర్కొంది. సూక్ష్మక్రిమిరహిత పాలు తాగడం వల్ల తలెత్తే ఆహార సంబంధమైన జబ్బుల కన్నా పచ్చిపాలు తాగడం వల్ల వచ్చే కలుషిత ఆహార జబ్బులు నూరు రెట్లు ప్రమాదకరమని ‘జాన్స్ హోప్కిన్స్ సెంటర్ ఫర్ ఎ లివబుల్ ఫ్యూచర్ సంస్థ’కు చెందిన బెంజమిన్ డేవిస్ తెలిపారు.
ఈమధ్య కాలంలో పచ్చిపాలు తాగడం ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం కూడా బాగా జరిగింది. ఆ పాలల్లో సహజ సిద్ధమైన యాంటీబాడీలు, ప్రొటీన్లు, బాక్టీరియా ఉన్నాయని, ఇవి సూక్ష్మక్రిమిరహిత పాలల్లో ఉన్న వాటి కంటే ఆరోగ్యకరంగా ఉంటాయని, కొన్ని రకాల ఎలర్జీలను సైతం పచ్చిపాలు తగ్గిస్తాయనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఇవేవీ నిజం కాదని శాస్త్రవేత్తలు తెలిపారు. పచ్చి పాలల్లోని ఇన్ఫెక్షన్ కారకాలైన బాక్టీరియా ఆహార సంబంధ జబ్బులను ప్రధానంగా పిల్లల్లో, గర్భవతుల్లో, వయోవృద్ధుల్లో, రోగనిరోధకశక్తి తక్కువగా ఉండేవారిలో రేకెత్తించే ప్రమాదం ఉందని తెలిపారు. ఈ అధ్యయనంలో భాగంగా 1,000 ఆర్టికల్స్ను, 81 జర్నల్స్ను అధ్యయనం చేశారు. పచ్చిపాలు తాగడం ప్రమాదకరమని శాస్త్రీయంగా నిరూపితమైందని ఈ సందర్భంగా బెంజమిన్ తెలిపారు.