ఈసీపీఆర్ విధానంతో గుజరాతీ వాసికి 'ఊపిరి' పోసిన చెన్నై ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి

మంగళవారం, 19 ఏప్రియల్ 2016 (17:10 IST)
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఒకటైన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీతో 38 యేళ్ళ గుజరాతి వాసికి మళ్లీ ఊపిరి పోసింది. గుండె పనితీరు పూర్తిగా ఆగిపోయిన దశలో 38 యేళ్ల వ్యక్తికి ఈసీపీఆర్ విధానం ద్వారా ప్రాణం పోశారు. ఇదే విషయంపై ఆస్పత్రికి చెందిన హృద్రోగ విభాగం డైరక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు డాక్టర్ రవికుమార్, కార్డియాక్ అనెస్థీషియా చీఫ్ డాక్టర్ కేజీ సురేష్ రావులు మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. గుజరాత్ రాష్ట్రానికి చెందిన 38 యేళ్ళ జయ్‌సుఖ్ భాయ్ అనే వ్యక్తి కార్డియోమిపోయపథీ అనే వ్యాధితో బాధపడుతూ వచ్చాడు. ఈ దశలో గుండె పనితీరు పూర్తిగా చివరి దశకు చేరుకుని ఉంటుందని తెలిపారు. 
 
దీంతో అతన్ని గుండె మార్పిడి కోసం పోర్‌బందర్ ‌నుంచి చెన్నైకు ఎయిర్‌లిఫ్ట్‌లో తరలించి, మలర్ ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడ ఆస్పత్రుల వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. ఆ తర్వాత రోగికి వివిధ రకాల వైద్య పరీక్షలు చేయగా, కార్డియోమిపోయపథీతో బాధపడుతున్నట్టు తేలింది. దీంతో వార్డుకు మార్చి, హృదయ దాత కోసం వేచిచూడటం జరిగిందన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో ఓ రోజున ఉన్నట్టుండి హృదయ స్పందన నిలిచిపోయిందన్నారు. ఆ వెంటనే అప్రమత్తమైన వైద్యబృందం కార్డియోపల్మనరీ రెసుస్కిటేషన్ విధానాన్ని ప్రారంభించారు. అయినప్పటికీ.. 45 నిమిషాల పాటు ఎలాంటి స్పందనలు లేవు. ఆ వెంటనే తక్షణం ఓ నిర్ణయం తీసుకుని ఎక్స్‌ట్రా కార్పోరియల్ కార్డియో పల్మనరీ రెసుస్కిటేషన్ (ఈసీపీఆర్) విధానం ద్వారా కార్డియోపల్మనరీ బైపాస్ మెషన్ (ఈసీఎంఓ) సహకారంతో శస్త్రచికిత్స చేసినట్టు తెలిపారు. ఆ పిమ్మట 45 నిమిషాల తర్వాత గుండె కొట్టుకోవడం ప్రారంభించిందని వివరించారు. ఎంకో అనేది కేవలం కృత్రిమ పంప్ అని వివరించారు.
 
 
ప్రస్తుతం ఈ రోగి సంపూర్ణ ఆరోగ్యంతో ఎలాంటి సమస్యలు లేకుండా బాగునట్టు తెలిపారు. అయితే, ఈ తరహా విధానం అత్యంత క్లిష్టతరంతో కూడుకున్నదని తెలిపారు. కృత్రిమ పంపింగ్ విధానం ద్వారా యూనిఫాంగా పంపింగ్ చేయాల్సి ఉందందన్నారు. అనంతరం డాక్టర్ సురేష్ రావు మాట్లాడుతూ కార్డియాక్ అరెస్ట్ అయిన పరిస్థితుల్లో ఈసీపీఆర్ విధానం ద్వారా చికిత్స చేస్తూ మరణ రేటును తగ్గించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అలాగే, డాక్టర్ రవికుమార్ మాట్లాడుతూ హృద్రోగ నిపుణిగా ఈ తరహా విధానం ఎంతో మేలైనదనీ, లైఫ్ సేవింగ్ విధానమన్నారు. అయితే, ఈ విధానం అమల్లో మాత్రం అనేక క్లిష్టతరమైన సమస్యలు ఎదురవుతాయన్నారు. ఈ సమావేశంలో రోగితో పాటు.. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి ఫెసిలిటీ డైరక్టర్ రఘునాథ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 
 

వెబ్దునియా పై చదవండి