జీడిపప్పుల పలావ్

గురువారం, 8 జనవరి 2009 (18:15 IST)
కావలసిన పదార్థాలు :
పలావ్ బియ్యం... అరకేజీ
జీడిపప్పు... 200 గ్రాములు
వెన్న... 50 గ్రాములు
కిస్‌మిస్... మూడు టీస్పూన్లు
ఉల్లిపాయ... పెద్ద సైజుది ఒకటి
లవంగాలు... కొద్దిగా
యాలక్కాయలు... సరిపడా
దాల్చిన చెక్క... కొద్దిగా
బే ఆకులు... కొద్దిగా
తేజ్‌పత్తా... కాస్తంత
కొత్తిమీర తరుగు... ఒక కప్పు
ఉప్పు... సరిపడా
ఫైనాఫిల్ ముక్కలు... అర కప్పు

తయారీ విధానం :
మూకుడులో సగం వెన్న వేసి వేడి చేయాలి. అందులో ఫైనాఫిల్ ముక్కలు, కిస్‌మిస్ వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. పలావ్ బియ్యం కడిగి, నానబెట్టి ఉంచుకోవాలి. జీడిపప్పును దోరగా వేయించాలి. మిగిలిన వెన్న వేసి చక్రాల్లాగా తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి వేయించాలి.

అందులోనే మసాలా దినుసులైన లవంగాలు, యాలక్కాయలు, బే ఆకులు, తేజ్‌పత్తా, వేయించిన జీడిపప్పు, నానబెట్టిన బియ్యం, తగినంత ఉప్పువేసి కలియబెడుతూ ఐదు నిమిషాలపాటు వేయించాలి. ఈ మిశ్రమానికి వేయించిన ఫైనాఫిల్, కిస్‌మిస్ ముక్కలను కూడా కలిపి, సరిపడా నీటిని పోయాలి.

మంటను తగ్గించి, 20 లేదా 25 నిమిషాల పాటు ఉడికించాలి. బియ్యం బాగా ఉడికి, పొడిపొడిగా అయిన తరువాత దించేయాలి. అంతే... జీడిపప్పులతో తయారైన పలావ్ రెడీ అయినట్లే...! దీన్ని సర్వింగ్ డిష్‌లోకి మార్చి, పైన కొత్తిమీర తరుగుచల్లి అతిథులకు వడ్డించాలి. ఈ పలావ్‌ను చికెన్ గ్రేవీతోగానీ, బంగాళాదుంప మసాలా కర్రీతోగానీ కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.

వెబ్దునియా పై చదవండి