కావలసిన పదార్థాలు : లేత వంకాయలు... 1 కేజీ టొమోటో... పావు కేజీ ఉల్లిపాయలు... 200 గ్రాములు పచ్చిమిర్చి... 5 వెల్లుల్లి... 2 గడ్డలు అల్లం... 100 గ్రాములు వేరుశెనగ పప్పు... 100 గ్రాములు ఎండుకొబ్బరి... అర చిప్ప పట్ట, లవంగం... తగినంత గోల్డ్ విన్నర్ ఆయిల్... పావు కేజీ కరివేపాకు... సరిపడా కొత్తిమీర... సరిపడా కారం... సరిపడా ధనియాలపొడి... సరిపడా పసుపుపొడి... సరిపడా ఉప్పు... తగినంత ఆవాలు, జీలకర్ర, మెంతులు... సరిపడా
తయారీ విధానం : ముందుగా వంకాయలను ముందువైపు నుండి నాలుగు చీలికలుగా (కాయ విడిపోకుండా) కోసి ఉప్పునీటిలో వేసుకోవాలి. వేరుశెనగపప్పు, ఎండుకొబ్బరి, పట్ట, లవంగాలను ముందు మెత్తగా నూరుకుని, అందులోనే అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల్లో సగం ఉల్లిపాయలు వేసు మెత్తగా రుబ్బుకోవాలి.
రుబ్బుకున్న పదార్థానికి కారంపొడి, ధనియాలపొడి, పసుపుపొడి, ఉప్పు, ఆయిల్ వేసి బాగా కలిపి ఈ మసాలా ముద్దను కోసి ఉంచుకున్న వంకాయలలో బాగా కూరాలి. ఇలా మొత్తం కాయలకు మసాలాముద్దను పట్టించిన తరువాత పావు గంటసేపు ఊరనివ్వాలి.
WD Photo
WD
తరువాత బాణలిలో సరిపడా నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, మెంతులతో పోపు పెట్టుకుని అందులోనే కరివేపాకు, కొత్తిమీర, నిలువుగా కోసుకున్న ఉల్లిపాయలు, రెండుగా కోసి ఉంచుకున్న పచ్చిమిరపకాయలను వేసి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. తరువాత వంకాయలను వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గుతున్న క్రమంలోనే వంకాలపై ముక్కలుగా కోసుకున్న టొమోటోలను వేసి ఆవిరిపైనే ఉడకనివ్వాలి.
కొద్దిసేపటి తరువాత తగినన్ని నీళ్ళను పోసి కూరను బాగా ఉడికించాలి. గ్రేవీ బాగా దగ్గరకు వచ్చేలా, నూనె పైకి తేలేలా కూర ఉడికిన తరువాత దానికి చింతపండు రసాన్ని కలిపి కొద్దిసేపటి తరువాత కొత్తిమీరను చల్లి దించేసి వేడి వేడిగా అతిథులకు వడ్డించాలి. ఇది చపాతీ, ఫ్రైడ్ రైస్, వేడి వేడి అన్నం, వెజిటబుల్ రైస్, నేతి అన్నం లాంటి వాటికి సైడ్డిష్గా వాడుకోవచ్చు.