కావలసిన పదార్థాలు : చేమదుంప ఆకులు... 20 బియ్యం... పావు కేజీ కందిపప్పు... వంద గ్రా. కొబ్బరితురుము... 50 గ్రా. ఎండుమిర్చి... 25 గ్రా. చింతపండు... 25 గ్రా. పసుపు... చిటికెడు ఉప్పు... తగినంత తురిమిన బెల్లం... 25 గ్రా. నూనె.. సరిపడా ఆవాలు.. ఒక టీ. ఇంగువ... చిటికెడు
తయారీ విధానం: ముందుగా బియ్యాన్నీ, కందిపప్పునీ మూడు నాలుగు గంటలు నానబెట్టాలి. చేమదుంపల ఆకుల్ని బాగా కడిగి పెట్టుకోవాలి. బియ్యం, కందిపప్పు, ఎండుమిర్చి, చింతపండు... అన్నింటినీ మెత్తగా రుబ్బుకోవాలి. కొద్దిగా పసుపు, ఇంగువ, ఉప్పు, బెల్లం ఈ మిశ్రమంలో కలపాలి. చేమదుంప ఆకుల్లోని దళసరి భాగాల్ని కత్తిరించి ప్లేటులో పరవాలి.
పిండిమిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని అరసెంటీమీటరు మందాన ఒక్కో ఆకుమీదా పరవాలి. ఆకు అంచుల్ని అన్నివైపులా లోపలకి మడవాలి. ఇప్పుడు ఆకు మొత్తాన్ని ఓ పక్క నుంచి మరో పక్కకు చుట్టుకుంటూ వెళ్లాలి. ఇలా అన్ని ఆకులూ చుట్టిన తరువాత ఇడ్లీకుక్కర్లో అరగంటసేపు ఉడికించి దించాలి. తరువాత స్టవ్మీద బాణలి పెట్టి నూనె పోసి, ఉడికించిన ఆకుల్ని వేయించి తీస్తే పత్రొడె తయారైనట్లే...!!