చైనాలో భారీ వర్షాలు- 80 మంది మృతి.. 16మంది గల్లంతు

శనివారం, 12 ఆగస్టు 2023 (13:20 IST)
Floods
చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చైనాలోని ఉత్తర ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో సామాన్యుల జనజీవనం పూర్తిగా స్తంభించింది. చాలా మంది ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులైనారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. 
 
విద్యుత్‌ అంతరాయంతో పలు ప్రాంతాలు అంధకారంలో మగ్గుతున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. అయితే నిరంతరాయంగా కురుస్తున్న వర్షాల కారణంగా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నాయి. వర్షాలు, వరదల కారణంగా చైనాలో ఇప్పటివరకు 78 మంది చనిపోయారు. చాలా మంది అదృశ్యమయ్యారు.
 
ఈ స్థితిలో ఉత్తర చైనాలోని జియాంగ్సు నగరంలో శనివారం ఉదయం భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. చాలా ఇళ్లు భూమిలో కూరుకుపోయాయి. ఆ ఇళ్లపై బురద పడి ఇద్దరు వ్యక్తులు దారుణంగా మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య 80కి చేరింది. 
 
ఈ విషయం తెలుసుకున్న రెస్క్యూ టీం, అగ్నిమాపక సిబ్బంది కొండచరియలు విరిగిపడిన ఇళ్ల శిథిలాలను తొలగించేందుకు రంగంలోకి దిగారు. ప్రాణాలతో పోరాడుతున్న నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో 16 మంది గల్లంతయ్యారు. 
 
గల్లంతైన కోసం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు