ఇజ్రాయేల్ ప్రతీకార దాడులు.. ఆరుగురు మృతి.. టెన్షన్.. టెన్షన్

ఠాగూర్

గురువారం, 3 అక్టోబరు 2024 (10:56 IST)
హిజ్బుల్లా స్థావరాలే లక్ష్యంగా లెబనాన్‌లో ఇజ్రాయేల్ మరోమారు దాడులు ప్రారంభించింది. లెబనాన్ పార్లమెంట్ భవనానికి అతి సమీపం నుంచి ఈ దాడులను ఇజ్రాయేల్ చేస్తుంది. గత 2006 తర్వాత బీరుట్ నగరంలో ఇజ్రాయేల్ దాడులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. 
 
హిజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయేల్ సేనలు గురువారం ఉదయం లెబనాన్ దేశ రాజధాని బీరుట్ నడిబొడ్డున రాకెట్లతో దాడి జరిపాయి. సెంట్రల్ బీరుట్‌లోని పార్లమెంట్ భవనానికి సమీపంలో ఉన్న ఓ భవనాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ దాడి జరిపినట్టు తెలుస్తోంది. బచౌరా ప్రాంతంలో జరిగిన ఈ దాడి లెబనాన్ ప్రభుత్వాన్ని నిర్వహించే ప్రదేశానికి దగ్గరలోనే జరగడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడుల్లో ఆరుగురు చనిపోయినట్టు సమాచారం. 
 
మరోవైపు, బీరుట్‌పై ఖచ్చితమైన వైమానిక దాడిని జరిపినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. భారీ పేలుడు శబ్దాలు విన్నామని స్థానికులు చెబుతున్నారు. బీరుట్ నగర దక్షిణ శివారు ప్రాంతాల్లో కూడా ఇజ్రాయెల్ బలగాలు దాడులు జరిపాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలంటూ ముందుగా హెచ్చరికలు: జారీ చేసిన అనంతరం పలు దాడులు జరిగాయి. అయితే సెంట్రల్ బీరుట్‌లో జరిగిన దాడి విషయంలో మాత్రం ఇజ్రాయెల్ బలగాలు హెచ్చరికలు చేయలేదు. కా
 
ఇదిలావుంటే, ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మరో వీడియోను విడుదల చేశారు. 'ప్రపంచ స్థిరత్వానికి హానికరమైన ఇరాన్‌కు వ్యతిరేకంగా చేస్తున్న కష్టతరమైన యుద్ధంలో పతాక స్థితిలో ఉన్నాం. ఇరాన్ మనల్ని నాశనం చేయాలనుకుంటోంది. కానీ అది జరగదు. మనమంతా కలిసి నిలబడతాం. దేవుడి సాయంతో కలసి కట్టుగా గెలుస్తాం' అని ఆయన పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు