కరోనా దెబ్బకు చైనాలో పిల్లులు - కుక్కల మాంసంపై నిషేధం

గురువారం, 2 ఏప్రియల్ 2020 (13:02 IST)
చైనాను కరోనా వైరస్ వణికించింది. చైనాలోని వుహాన్ నగరంలో పురుడుపోసుకున్న ఈ వైరస్ ధాటికి చైనాలో మూడు వేల మందికి పైగా చనిపోయారు. ప్రస్తుతం ఈ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే లక్షలాది మంది ఈ వైరస్ బారిపడగా, సుమారుగా 45 వేల మంది వరకు చనిపోయారు. ఒక్క చైనాలోనే 81 వేల మంది కరోనా బాధితులు ఉన్నారు. 
 
ఈ పరిస్థితుల్లో కరోనా దెబ్బకు చైనాలోని షెన్‌జెన్‌ సిటీలో పిల్లులు, కుక్కల విక్రయంపై నిషేధం విధించింది. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ కొత్త చట్టం ప్రకారం కుక్కలు, పిల్లులు, బల్లులు, పాములతో పాటు రక్షిత వన్యప్రాణులకు తినడాన్ని నిషేధించారు. పాములు, బల్లులు, పిల్లులు, కుక్కలతో సహా రక్షిత వన్యప్రాణుల పెంపకం, విక్రయం, వినియోగంపై షెన్‌జెన్‌లో నిషేధం విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. 
 
పెంపుడు జంతువులుగా కుక్కలు, పిల్లులు ఇతర జంతువులతో పోలిస్తే మానవులతో సన్నిహిత సంబంధాలను ఏర్పరుచుకుంటాయి. కుక్కలు, పిల్లులు, ఇతర పెంపుడు జంతువుల వినియోగాన్ని అభివృద్ధి చెందిన హాంగ్‌కాంగ్‌, తైవాన్‌ దేశాల్లో ఇప్పటికే నిషేధించారు. చైనాలోని వుహాన్‌ నగరంలోని జంతువధ శాల కేంద్రంగా 2019, డిసెంబర్‌ నెలలో కరోనా వైరస్‌ ప్రబలిన విషయం తెలిసిందే. 
 
అయితే, కొత్తగా రూపొందించిన చట్టం నుంచి పందులు, ఆవులు, గొర్రెలు, గాడిదలు, కుందేళ్లు, కోళ్లు, బాతులు, పావురాలు, పిట్టలకు నిషేధం నుంచి మినహాయించారు. కాగా, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చైనా ప్రభుత్వం ఫిబ్రవరిలో అడవి జంతువుల అమ్మకం మరియు వినియోగంపై శాశ్వత నిషేధాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు