చలికాలం వస్తే మళ్లీ చైనాలో కరోనా విజృంభిస్తుందట..

మంగళవారం, 21 ఏప్రియల్ 2020 (18:44 IST)
కరోనా బాధితులకు చికిత్స అందించే అత్యవసర పరిస్థితుల్లో వైద్య సిబ్బందిని కాపాడుకునేందుకు ఈ ఏడాది చివర్లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు చైనా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. శీతాకాలం మొదలు కాగానే కరోనా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం వుండటంతో వ్యాక్సిన్‌ను సిద్ధం చేసే పనిలో వుంది. చైనాలో మరోసారి వైరస్ విజృంభించే అవకాశం వుందని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
 
చలికాలం ఆరంభమవ్వగానే పరిస్థితి శ్రుతిమించే ప్రమాదముందని జడుసుకుంటున్నారు. రష్యా సరిహద్దుల్లోని హేలియాంగ్‌జియాంగ్‌లో కేసులు పెరగడం డ్రాగన్‌ను కలవరపెడుతోంది. ఇంకా చైనాలో సోమవారం కొత్తగా 11 కొవిడ్‌-19 కేసులు నమోదయ్యాయని జాతీయ ఆరోగ్య కమిషన్‌ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. ఇందులో నలుగురు విదేశాల నుంచి రాగా మిగతా ఏడుగురికి దేశంలోనే వైరస్‌ సోకింది.  
 
కరోనా వైరస్‌తో పరిస్థితి అదుపు తప్పితే వైద్యసిబ్బందికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను ఇస్తామని చైనా వ్యాధి నియంత్రణ సంస్థ డైరెక్టర్‌ గావో ఫు తెలిపారు. సొంత పరిశోధన, అభివృద్ధిని బట్టి ఔషధాలు, టీకాలు రూపొందుతాయని చెప్పారు. ప్రతి ఒక్కరి కృషితో వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు