భారత్ - కెనడా దేశాల మధ్య దెబ్బతిన్న దౌత్య సంబంధాలు.. పెరగనున్న ఎర్రపప్పు ధరలు

గురువారం, 28 సెప్టెంబరు 2023 (11:02 IST)
భారత్ - కెనడా దేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గత కొన్ని రోజులుగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొనివున్నాయి. దీంతో కెనడా నుంచి ప్రోటీన్లు అధికంగా ఉండే ఎర్రపప్పు దిగుమతిపై ప్రభావం చూపనుంది. ఈ కారణంగా వాటి ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అయితే, ప్రభుత్వ వర్గాలు మాత్రం అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కావని అంటున్నారు. 
 
ఎర్రపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో కెనడా నుంచి భారత్ భారీగా దిగుమతి చేసుకుంటుంది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో భారత్ రూ.3,079 కోట్ల విలువైన 4,85,495 టన్నుల ఎర్రపప్పును దిగుమతి చేసుకుంది. భారత్ దిగుమతి చేసుకునే మొత్తం ఎర్రపప్పు దిగుమతుల్లో ఇది సగం కంటే ఎక్కువ. 
 
గతేడాది ఏప్రిల్ నుంచి జులై వరకు 1,90,784 టన్నుల ఎర్రపప్పు దిగుమతి కాగా, ఈ ఏడాది అదేసమయంలో 420 శాతం అధికంగా దిగుమతి అయినట్టు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. మన దేశంలో ఏడాదికి 24 లక్షల టన్నుల ఎర్రపప్పు వినియోగిస్తుండగా, దేశంలో మాత్రం 16 లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. 
 
ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య కెనడా నుంచి 95 వేల టన్నుల పప్పు దిగుమతి అయింది. అదే సమయంలో ఆస్ట్రేలియా నుంచి 1.99 లక్షల టన్నుల పప్పును భారత్ దిగుమతి చేసుకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్-కెనడా మధ్య ఎగుమతి, దిగుమతులపై నిషేధం విధిస్తే దేశంలో పప్పుల కొరత ఏర్పడి ధరలు పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు