అంజూకు పిల్లల బెంగ... భారత్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధం....

సోమవారం, 30 అక్టోబరు 2023 (12:32 IST)
పాకిస్థాన్‌కు చెందిన ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం దేశం విడిచి వెళ్లిపోయిన భారత వివాహిత అంజు తిరిగి భారత్‌కు రానుంది. తన ఇద్దరు పిల్లలపై బెంగతో ఆమె మానసికంగా కుంగిపోయినట్టు ఆమె పాకిస్థాన్ భర్త వెల్లడించాడు. దీంతో కుమార్తె, కుమారుడిని చూసేందుకు రాజస్థాన్‌కు రానుందని, ఇందుకోసం పాకిస్థాన్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. 
 
ఇందుకోసం పాకిస్థాన్ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారని, పాక్ ప్రభుత్వం అనుమతి రాగానే ఆమె రాజస్థాన్‌కు వస్తారని ఆమె పాక్ భర్త నస్రుల్లా తెలిపారు. పిల్లలపై బెంగతో గత నెలలో అంజు మానసికంగా కుంగిపోయిందని తెలిపారు. పిల్లలను చూసేందుకు రాజస్థాన్ వెళ్లాలని తను నిర్ణయించుకుందని, కూతురు కొడుకును చూసి తిరిగి పాకిస్థాన్ వస్తుందని నస్రుల్లా చెప్పారు.
 
రాజస్థాన్‌కు చెందిన అంజుకు 34 యేళ్లు. భర్తతో పాటు 15 యేళ్ల కుమార్తె, ఆరేళ్ల కొడుకు ఉన్నారు. అయితే, ఫేస్‌బుక్‌లోని పరిచయమైన పాకిస్థాన్ ప్రియుడు నస్రుల్లా (29)ను ప్రేమించి అతడి కోసం ఆగస్టు నెలలో వాఘా సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టారు. ఆపై మతం మార్చుకుని ఫాతిమాగా మారి నస్రుల్లాను వివాహం చేసుకుంది. 
 
ఆ తర్వాత ఇకపై తన ఇల్లు పాకిస్థాన్ అని పేర్కొంది. పాక్ ప్రభుత్వం ఆమె వీసాను యేడాది పాటు పొడగించింది. ఈ క్రమంలో అంజు కొన్ని రోజులుగా పిల్లల కోసం బెంగు పెట్టుకుందని నస్రుల్లా చెప్పారు. పిల్లలను చూసేందుకు భారత్‌కు వెళ్ళి వస్తానని చెప్పడంతో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నామని వివరించారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు