కరోనా టీకా వేసుకుంటేనే మక్కాలోకి అనుమతి : సౌది సర్కారు నిర్ణయం

మంగళవారం, 6 ఏప్రియల్ 2021 (12:08 IST)
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగడమే. ఇప్పటికే పలు దేశాల్లో రెండు, మూడు దశలను దాటిపోయి నాలుగో దశలో వ్యాపిస్తోంది. ఈ క్రమంలో సౌదీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 
 
రంజాన్‌ మాసం మొదలైన నాటి నుంచి ఇమ్యూనిటీ కలిగి ఉన్న వారు మాత్రమే ఉమ్రా తీర్థయాత్ర చేసేందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు తీసుకున్న వారు, గడిచిన 14 రోజుల్లో ఒక డోసు తీసుకున్న వారు లేదా కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నవారు మాత్రమే ఉమ్రా యార్థ చేసేందుకు అనుమతి ఉంటుందని సౌదీ ప్రభుత్వం పేర్కొంది. 
 
మక్కా మసీదులో జరిగే ప్రార్థనలలో పాల్గొనే వారికి కూడా ఇవే నిబంధనలు కొనసాగుతాయని తెలిపింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే, ఈ ఆంక్షలు ఎప్పటి వరకు కొనసాగుతాయనేదానిపై ప్రభుత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. 
 
హజ్‌ యాత్ర వరకు ఇవే ఆంక్షలు కొనసాగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. గత సంవత్సరం యాత్రకు కేవలం పది వేల మంది మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ఏడాది ఎంతమందికి అనుమతిస్తుందో వేచి చూడాలి. 
 
కాగా, 2019లో హజ్‌ యాత్రకు ప్రపంచ వ్యాప్తంగా 25 లక్షల మంది ముస్లింలు వెళ్లారు. సౌదీలో ఇప్పటి వరకు 3.93 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా, 6,700 మంది కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు సౌదీలో 50 లక్షలకుపైగా మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు