పాక్ జైలులో భారతీయ ఇంజనీర్‌పై దాడి.. సాయం చేయాల్సిందిగా సుష్మా స్వరాజ్ ఆదేశం

ఆదివారం, 7 ఆగస్టు 2016 (16:13 IST)
పాకిస్థాన్ జైలులో ఉన్న ఓ భారతీయ ఇంజనీర్‌పై దాడి జరిగింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇంజనీర్ ముంబై వాసి. అతని పేరు హమీద్ అన్సారీ. అతనిపై ఇప్పటివరకు జైలు ఖైదీలు మూడు సార్లు దాడి చేశారు. దీంతో అతను జైలులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ స్పందించారు. అన్సారీకి వెంటనే న్యాయ సాయం అందించాలని పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్‌కు ఆమె ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా సుష్మస్వరాజ్ తెలిపారు. 
 
హమీద్‌ అన్సారీ ఆన్‌లైన్‌లో పరిచయమైన యువతిని కలిసేందుకు 2012లో పాకిస్థాన్‌ వెళ్లాడు. నకిలీ ధ్రువ పత్రాలతో దేశంలోకి ప్రవేశించినందుకు అతనిని పాకిస్థాన్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో పెషావర్‌ కోర్టు అతనికి మూడేళ్లు జైలు శిక్ష విధించింది. ఇటీవల కాలంలో తన క్లయింట్‌పై జైలులోని తోటి ఖైదీలు మూడుసార్లు దాడులు జరిపారని, అతని ప్రాణాలకు ముప్పు ఉందని అన్సారీ తరపు న్యాయవాది క్వాజీ మెహమ్మద్ అన్వర్ పెషావర్ కోర్టుకు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి