కీలక అంశాలపై భారత్‌తో కలిసి పని చేస్తాం : కెనడా ప్రధాని ట్రూడో

వరుణ్

ఆదివారం, 16 జూన్ 2024 (11:56 IST)
పలు కీలక అంశాలపై భారత్‌తో కలిసి పని చేస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ప్రకటించారు. ఇటలీ వేదికగా జీ7 దేశాల శిఖరాగ్ర సదస్సు జరుగుతుంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోడీ కూడా పాల్గొన్నారు. ఈ సదస్సులోభాగంగా, కెనడా ప్రదాని జస్టిన్ ట్రూడో, భారత ప్రధాని నరేంద్ర మోడీలు సమావేశమయ్యారు. 
 
నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ - కెనడా దేశాల మధ్య సంబంధాలు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో జి7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా వారిద్దరూ భేటీ అయ్యారు. ఆ తర్వాత ట్రూడో మాట్లాడుతూ, ఇరు దేశాలు కలిసి పనిచేయాల్సిన సున్నితమైన అంశాల వివరాల జోలికి నేను వెళ్లడం లేదు. కానీ, కలిసి పని చేయడానికి కట్టుబడి ఉన్నాం. భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పనులను మేం డీల్‌ చేస్తాం అని పేర్కొన్నారు. 
 
కాగా, శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ తాను ట్రూడోతో కరచాలనం చేస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. 'కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోను జీ7 సదస్సులో కలిశాను' అంటూ దానికి క్యాప్షన్‌ జత చేశారు. మరోవైపు కెనడా ప్రధాని కార్యాలయం కూడా దీనిపై స్పందించింది. ఇరు దేశాధినేతలు ద్వైపాక్షిక అంశాలపై సంక్షిప్తంగా చర్చించారని పేర్కొంది. మోదీ తిరిగి ప్రధానిగా ఎన్నిక కావటంతో ట్రూడో శుభాకాంక్షలు తెలిపారని వెల్లడించింది. 
 
కాగా, జీ20 సదస్సు తర్వాత కెనడా ప్రధాని భారత్‌పై నేరుగా ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది జులై 18న బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య జరిగింది. దీని వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలతో రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఈ ఆరోపణలను భారత్‌ తీవ్రంగా ఖండించింది. తగిన ఆధారాలు ఇవ్వాలని.. ఆ తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటామని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు