అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో... మాజీ సీఎం జగన్ నిర్వేదం

వరుణ్

శుక్రవారం, 14 జూన్ 2024 (14:08 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైకాపా పార్టీ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. మొత్తం 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసిన జగన్ పార్టీ.. కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాను సైతం కోల్పోయింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎంగా పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఇందులో జగన్ తీవ్ర నిర్వేదంలో మాట్లాడారు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో తెలియదన్నారు. 
 
అంతేకాకుండా, అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు చేస్తే మన పార్టీని ఇంత చిత్తుగా ఎందుకు ఓడించారో అర్థం కావడం లేదన్నారు. అదేసమయంలో చూస్తుండగానే ఐదేళ్ల కాలం గడిచిపోయిందన్నారు. వచ్చే ఐదేళ్లూ అలాగే గడిచిపోతాయని తనకు తాను ఓదార్చుకుంటూ ఎమ్మెల్సీలకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా అడగకుండా సీఎం చంద్రబాబు తప్పుచేశారంటూ కొత్త పల్లవి అందుకున్నారు. 
 
కానీ, అధికారపక్షంలో ఉన్న ఐదేళ్లలో తాను ఏనాడూ హోదా అంశం ప్రస్తావించని విషయం కావాలనే దాచేసిన విషయాన్ని మాత్రం ఆయన మాట మాత్రం చెప్పలేదు. ప్రతిపక్ష హోదా అయినా శాసనసభలో లభిస్తుందో లేదోనన్న నిర్వేదాన్ని జగన్‌ వ్యక్తం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుకు మద్దతు ఇస్తున్న చంద్రబాబు ప్రత్యేక హోదాను కోరడం లేదని జగన్‌ అన్నారు. 
 
ఆయన తప్పులు చేసి దొరుకుతారన్నారు. ప్రతిపక్ష నేతగా 14 నెలల పాటు పాదయాత్ర చేశానని, ఆనాటి ఓపిక ఇంకా తనకున్నదని జగన్‌ పేర్కొన్నారు. వచ్చే ఐదేళ్లూ ప్రజల్లోనే ఉందామని ఎమ్మెల్సీలకు జగన్‌ సూచించారు. కానీ, జగన్ మాటలపై ఏ ఒక్కరికీ నమ్మకం లేకపోవడంతో ఇప్పటికే పక్కదారులు చూసుకుంటున్నట్టు ప్రచారం సాగుతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు