జమ్మూకాశ్మీర్‌లో పెట్రేగుతున్న ఉగ్రవాదులు... ఉక్కుపాదంతో అణిచివేయాలంటూ ప్రధాని ఆదేశం

వరుణ్

శుక్రవారం, 14 జూన్ 2024 (09:16 IST)
గత కొన్ని రోజులుగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదులు పెట్రేగిపోతున్నారు. అక్కడ పర్యటించే పర్యాటకులు, ప్రయాణికులు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అక్కడ నెలకొన్న పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఉగ్రవాదులను ఉక్కుపాదంతో అణిచి వేయాలని ఆదేశించారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ ఒక సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో భద్రతా బలగాల మోహరింపు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కూడా మాట్లాడినట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాలని మోడీ ఆదేశించినట్లు వెల్లడించాయి. పూర్తిస్థాయి సామర్థ్యాలను వినియోగించుకొని ఉగ్రవాదులను అణచివేయాలని పేర్కొన్నట్లు తెలిపాయి. 
 
జమ్మూకాశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హాతో కూడా ప్రధాని మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. స్థానిక యంత్రాంగం తీసుకుంటున్న చర్యలను సిన్హా ప్రధానికి వివరించారు. కాగా, రియాసీలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక చైనా, పాక్‌ సంయుక్త ప్రకటనలో జమ్మూకాశ్మీర్‌పై చేసిన వ్యాఖ్యల పట్ల భారత్‌ గురువారం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్‌, లడ్డాక్, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ మరోమారు తేల్చి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు