భారతీయ చిన్నారులకు గూడీ చేయూత

ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్‌తో కన్నుమూసిన బ్రిటన్ నటి జేడ్ గూడీ భారతీయ చిన్నారులకు చేయూత నిచ్చారు. ఈ లోకంలో తన కుమారులనే అత్యధికంగా ప్రేమించానని చెప్పుకున్న గూడీ, బాబీ (5), ఫ్రెడ్డీ (4) (గూడీ కొడుకులు)లకు 2 మిలియన్ పౌండ్ల ఆస్తిని ఇస్తున్నట్లు ఓ వీలునామాలో పేర్కొంది.

తన కుమారులతో పాటు భారతదేశంలోని చిన్నారులకు 100,000 పౌండ్లను విరాళంగా అందజేయాలని మరణానికి ముందే రాసిన ఓ వీలునామాలో గూడీ తెలిపింది. క్యాన్సర్ వ్యాధితో మృత్యువుతో పోరాడి పోరాడి ఆదివారం (22వ తేదీ) తుదిశ్వాస విడిచిన జేడ్ గూడీ, తన పిల్లల జీవితం కోసం సర్వం సమకూర్చింది.

ఇందులో భాగంగా, రెండు మిలియన్ పౌండ్లను తన కుమారులకు, 100,000 పౌండ్లు భారతదేశంలోని పేద చిన్నారులకు, ఒక మిలియన్ పౌండ్‌ తన తల్లి జాకీ బడ్డన్‌కు అందజేయాల్సిందిగా ఓ వీలునామాలో పేర్కొందని డైలీ స్టార్ వెల్లడించింది. అయితే తన ప్రియుడు, భర్త జాక్ ట్వీడ్ కోసం జేడ్ గూడీ తన సొత్తు కాసింత కూడా ఇవ్వలేదని డైలీ స్టార్ తెలిపింది.

మరణానికి ముందు రాసిన ఈ వీలునామాలో గూడీ పేర్కొన్న వివరాలు ఎలా ఉన్నాయంటే..? తను నివసించిన ఇల్లు, తన సంపాదన అంతా తన కుమారులిద్దరికే చెందుతాయని తెలిపింది. ఎసెక్స్‌లోని తన గృహంలో, తన కుమారులిద్దరితో పాటు తన తల్లి కూడా వారితో కలిసి ఉండవచ్చునని గూడీ అందులో పేర్కొంది. తన కుమారులంటే తన కెంతో ఇష్టమని, వారికే తొలి ప్రాధాన్యత నిస్తానని వెల్లడించింది.

ఇదిలా ఉండగా.. జేడ్ గూడీ సొత్తులో తనకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని, జాక్ (గూడీ భర్త) చాలా ఆగ్రహం వ్యక్తం చేశాడని వచ్చిన వార్తలను జాక్ ట్వీడ్ కొట్టి పారేశారు. తాను ఎప్పుడూ డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వనని, తన కుటుంబానికే ముఖ్యత్వం ఇస్తానని జాక్ వెల్లడించాడు.

తను ప్రేయసి గూడీయే ఈ లోకాన్ని వదిలి తిరిగిరాని చోటుకు వెళ్లిపోయిందని, తన భార్యకంటే తనకు ధనమంత ముఖ్యం కాదని జాక్ స్పష్టం చేశారు. గూడీ కుమారులకు ఆస్తిని రాసిపెట్టడంలో తన కెలాంటి అభ్యంతరం లేదని జాక్ పేర్కొన్నట్లు డైలీ స్టార్ తన ప్రచురణలో వెల్లడించింది.

వెబ్దునియా పై చదవండి