అక్కడ దిగగానే ఆకాశాన్నంటే పర్వతాలు కనిపిస్తాయ్... చూడాల్సిందే...

మంగళవారం, 1 మే 2018 (15:51 IST)
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ వేసవిలో పిల్లలకు, పెద్దలకు ఆనందంగా, ఆహ్లాదంగా ఉండాలి అంటే ఏదో ఒక విహార యాత్రకు వెళ్లవలసిందే. మనం చూడదగ్గ ప్రదేశాలలో భూటాన్ ఒకటి. కొండలలో నెలకొన్న ఈ చిట్టి దేశ జనాభా ఎనిమిది లక్షలకు మించి ఉండదు. చాలామంది బుద్ధం శరణం గచ్చామి అనేవాళ్లే. ఊరూరా బుద్ధిజం ఆనవాళ్లే. 
 
డొంకల్లో, నదీతీరంలో, కొండ వాలులో ఎక్కడ చూసినా బౌద్ధ మఠాలే కనిపిస్తాయి. పెద్దపెద్ద ఆరామాల్లో వందలమంది బౌద్ధ సన్యాసులుంటారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భూటానీయులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆ దేశంలో టీవీ 1999లో మెుదలయ్యిందంటే ఆశ్చర్యం కలుగుతుంది.
 
కానీ పర్యావరణాన్ని పరిరక్షించడంలో వాళ్లు అందరికన్నా ముందున్నారు. బౌద్ధ పధంలో నడిచే భూటాన్‌లో గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, భూమి స్వచ్ఛం, ఆ భూమిలో పండే ఆహార ధాన్యాలు కూడా స్వచ్ఛం. ఆ దేశంలో సాగుబడి నూటికి నూరు శాతం సేంద్రియ బాటలో సాగుతుంది. సముద్ర మట్టానికి 7500 అడుగుల ఎత్తులో ఉండే భూటాన్‌లో హిమాలయాల సోయగాలు, కొండలు, కోనలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి.
 
దేశంలో ఉన్న ఏకైక అంతర్జాతీయ విమానాశ్రయం పారో నగరంలో ఉంటుంది. చుట్టూ కొండలు, గుట్టలతో ఉండే పారో విమానాశ్రయంలో దిగగానే మంచు తెరలు స్వాగతం పలుకుతాయి. ఆ తెరల చాటునుంచి ఆకాశాన్నంటే పర్వతాలు కనిపిస్తాయి. పారో ఎయిర్‌పోర్ట్ సౌందర్యం చూడటంతోనే పర్యాటకులలో ఆనందం మెుదలవుతుంది. కొండల నడుమ ఉన్న లోయలో పారే పారో నది, తీరం వెంట విస్తరించిన జనావాసాలు, బౌద్ధరామాలు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి.
 
పారోలో నేషనల్ మ్యూజియం, పురాతన కట్టడాలు అన్నీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. పారో నుంచి కొంత దూరంలో ధింపూ ఉంటుంది. ఇక్కడ 51.5 మీటర్ల  ఎత్తులో ఉన్న బుద్ధుడి కాంస్య విగ్రహం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇక్కడకు దగ్గరలో ఉన్న పునాఖాలో భూటాన్ జానపద వైభవం కనిపిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు