జమ్మూకాశ్మీర్‌లో పెట్రేగిపోయిన తీవ్రవాదులు... ఆర్మీ వాహనంపై దాడి..

ఠాగూర్

శుక్రవారం, 25 అక్టోబరు 2024 (12:32 IST)
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు పెట్రేగిపోయారు. గురువారం సాయంత్రం ఆర్మీ వాహనంపై దాడికి పాల్పడ్డారు. నియంత్రణ రేఖకు (ఎల్.ఓ.సి) సమీపంలో ఉండే బొటాపత్రి ప్రాంతంలోని నాగిన్ పోస్టా సమీపంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులతో పాటు ఇద్దరు సహాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత ఆర్మీ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. 
 
'కాల్పుల్లో ఇద్దరు సైనికులు, ఇద్దరు పోర్టర్లు (సహాయ కార్మికులు) మృత్యువాతపడ్డారు. వైద్య కోసం తక్షణమే హాస్పిటల్‌కు తరలించాం. ఎన్‌కౌంటర్ పురోగతిలో ఉంది' అని పేర్కొంది. 
 
కాగా, ఈ ఘటన జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోకి మళ్లీ ఉగ్రవాదుల చొరబాట్లపై ఆందోళన రేకెత్తిస్తోంది. సరిహద్దులో చొరబాట్లు మళ్లీ మొదలయ్యాయని ఆర్మీ మూలాలు భావిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతంలోని సరిహద్దు వెంబడి బలగాలు నిఘాను పెంచాయి. 
 
నిజానికి ఈ ప్రాంతమంతా ఆర్మీ ఆధీనంలోనే ఉంటుంది. వేసవి ప్రారంభంలో ఒక ఉగ్రవాద గ్రూపు భారత్‌లోకి చొరబడి అప్రావత్ శ్రేణిలోని ఎత్తైన ప్రాంతాలలో దాగినట్టు గతంలో రిపోర్టులు వెలువడుతున్నాయని అధికారులు తెలిపారు. 
 
మరోవైపు, ఉగ్రవాదుల దుశ్చర్యపై జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. కాశ్మీర్ లోయలో ఇటీవల వరుస ఉగ్రదాడులు జరుగుతుండటం కలవరపరుస్తోందన్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని బొటాపత్రి ప్రాంతంలో ఆర్మీ వాహనంపై దాడి చాలా దురదృష్టకరమన్నారు. 
 
కాగా, ఇటీవల జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత నేషనల్ కాన్ఫరెన్స్ సారథ్యంలోని కూటమి అధికారాన్ని కైవసం చేసుకోగా, ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా బాధ్యతలు స్వకరించారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన తొలి ఉగ్రఘటనగా ఆర్మీ అధికారులు పేర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు