ఒక్క మిడత పది ఏనుగుల తిండి తింటుందట! మిడతలను తినమంటే తింటారా?

గురువారం, 28 మే 2020 (09:56 IST)
Locusts
భారత్‌కు మిడతల ద్వారా పెను ముప్పు పొంచి వుందని పర్యావరణ కేంద్ర అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత వినాశకరమైన వలస తెగులుగా మిడతలు పేరొందాయి. ఒక్క పెద్ద మిడత రోజూ తన బరువుకు సమానమైన తిండి తింటుంది. పది ఏనుగులు లేదా 25 ఒంటెలు లేదా 2,500 మంది మనుషులు ఒకరోజులో తినే ఆహారాన్ని ఒక చిన్నస్థాయి మిడతల గుంపు తినేస్తుందంటే నమ్మితీరాల్సిందే.
 
ఎడారి మిడతలు అత్యంత విధ్వంసకరమైనవి. ఒక చదరపు కిలో మీటర్ దండులో ఎనిమిది కోట్ల వరకు మిడతలు ఉంటాయి. గాలి వేగాన్ని బట్టి రోజుకు సుమారు 135 నుంచి 150 కిలో మీటర్ల వరకు ప్రయాణిస్తాయి. వీటి సంతానోత్పత్తి రేటు కూడా ఎక్కువే. బతికే 90 రోజుల్లో ఒక్కో మిడత 2 గుడ్లు పెడుతుంది. ఆ గుడ్లు 45 రోజుల్లో పెరిగి పెద్దవై, తర్వాతి నెల రోజుల్లో అవీ గుడ్లు పెడతాయి. మిడతలకు ఇదే తినాలనే నియమం లేదు. పచ్చగా కళకళలాడే ఏ మొక్కైనా వాటికి విందు భోజనంగా లాగిస్తాయి. ఒక్కో దండులో లక్షల కొద్దీ ఉండే మిడతలు 35 వేలమందికి సరిపడా ఆహారాన్ని ఒకేరోజులో లాగించగలవు. అవి వాలిన చోట పచ్చదనం కనుమరుగవుతుంది. 
 
మిడతల ముప్పును నివారించడానికి స్పష్టమైన పరిష్కారం ఏమీ లేదు. దాంతో పంటలను కాపాడుకోవడానికి రైతులు తమకు తెలిసిన ప్రయోగాలన్నీ చేస్తున్నారు. పురుగు మందులు కలిపిన నీటిని పంటలపై చల్లుతున్నారు. మిడతల దండును తరిమికొట్టడానికి డప్పుల్ని కొడుతున్నారు. టపాసులు పేలుస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తు రు. ప్రభుత్వాలు కూడా మిడతల దూకుడుకు బ్రేక్ వేయడానికి ప్రయత్నిస్తున్నాయి. 
 
ఆస్ట్రేలియా పరిశోధకులు వింత పరిష్కారం చెప్పారు. మిడతల్లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయట. అవి లక్షలాదిగా లభ్యమవుతున్నందున వాటిని ఆహారంగా మార్చుకోవచ్చని సూచించారు. చాలాదేశాలు మిడతలను ఆహారంగా తీసుకొని వాటి బెడద తగ్గించుకున్నాయని చెప్తున్నారు. ఐతే.. ఇది మనదేశంలో సాధ్యం కాదు. ఇప్పటికే కరోనా వైరస్‌ దెబ్బకు మాంసాహారం తినడానికి ప్రజలు జంకుతున్నారు. అలాంటిది, మిడతలను తినమంటే వాంతులు చేసుకుని పారిపోతారని నిపుణులు అంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు