ఆశ్చర్యపోయిన పోలీసులు... : భిక్షగాడి సామాజికదూరం... వీడియో వైరల్

శనివారం, 11 ఏప్రియల్ 2020 (09:25 IST)
కరోనా వైరస్ గుప్పెట్లో ప్రపంచం చిక్కుకుంది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రతి ఒక్కరూ ప్రాణభయంతో వణికిపోతున్నారు. ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ మహమ్మారి బారినపడకుండా ఉండాలంటే సామాజిక, భౌతిక దూరమే ఏకైక మార్గమని నిపుణులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. 
 
దీంతో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రజలు మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. చెవిన వేసుకోవడం లేదు. 
 
కానీ ఓ నిరాశ్రయుడు (భిక్షగాడు) మాత్రం సామాజిక దూరంపై అవగాహన కల్పించి పోలీసులను ఆశ్చర్యపరిచాడు. ఫుట్‌పాత్‌ మీద ఉండే ఆ వ్యక్తికి కరోనాపై అవగాహన ఉంది. అంతేకాదు ఈ వైరస్‌ బారిన పడొద్దనే స్పృహ అతనిలో ఉంది. 
 
అందుకే దగ్గరకు వస్తున్న పోలీసులను అప్రమత్తం చేసి, సామాజిక దూరం పాటించాలని పోలీసులకే పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వివరాలను పరిశీలిస్తే,...
 
'కేరళ రాష్ట్రంలోని కోళికోడ్ పట్టణంలో స్థానిక పోలీసులు నిరాశ్రయులను గుర్తించి వారికి అన్నపానీయాలను పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి దుకాణం ముందు పడుకొని ఉన్నాడు. అతని వద్దకు ముగ్గురు పోలీసులు చేరుకున్నారు. ఆ నిరాశ్రయుడి పరిస్థితిని గమనించిన పోలీసులు అటు నుంచి ఆహార పొట్లంతో పాటు. మంచినీళ్ళ బాటిల్‌తో మళ్లీ అతని వద్దకు తిరిగి వచ్చారు. 
 
అయితే ఆ నిరాశ్రయుడి వద్దకు ఓ పోలీసు చేరుకుంటున్న సమయంలో సదరు వ్యక్తి అప్రమత్తమయ్యాడు. గబుక్కున లేచి.. తన వద్దకు రావొద్దంటూ సూచించాడు. కొంచెం దూరంలోనే ఆహారం పెట్టాలని ఆ వ్యక్తి రౌండప్‌ చేశాడు. దీంతో పోలీసులు అక్కడే ఫుడ్‌ ప్యాకెట్‌, వాటర్‌ బాటిల్‌ పెట్టి వెళ్లిపోయారు. 
 
సామాజిక దూరం ఖచ్చితంగా పాటించాలని నిరాశ్రయుడు పోలీసులకు సూచించారు. అతని సూచనలతోనే పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. పోలీసులు ఇచ్చిన ఆహారాన్ని ఆకలితో ఉన్న నిరాశ్రయుడు వెంబడే తినేశాడు. ఈ వీడియోను స్థానికంగా ఉన్న ఓ షాపు యజమాని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు