రాష్ట్రపతి క్షమాపణలు చెప్పాల్సిందే.. లేకుంటే రాకుండా మానుకోవాల్సిందే..

గురువారం, 1 మార్చి 2018 (18:28 IST)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రస్తుతం కష్టాలు తప్పేలా లేవు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆయన్ని వెంటాడుతున్నాయి. 2010లో రంగనాథ్ మిశ్రా కమిషన్ నివేదికపై రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ అధికార ప్రతినిధి హోదాలో.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్డ్ కులాల కేటగిరీలో ముస్లింలు, క్రైస్తవులను చేర్చడం రాజ్యాంగ విరుద్ధమవుతుందని వ్యాఖ్యానించారు. 
 
రంగనాథ్ మిశ్రా కమిషన్ సమాజంలో ఆర్థిక వెనకబడిన మతాలవారికి, భాషలపరంగా మైనారటీలుగా ఉన్నవారికి 15 శాతం రిజర్వేషన్లు కల్పించాలని , వారిని ఎస్సీల్లో చేర్చాలని సూచించింది. ఈ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం సాధ్యం కాదని రామ్‌నాధ్ కోవింద్ కామెంట్స్ చేశారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం రాష్ట్రపతి ఇబ్బందులు తెచ్చి పెట్టింది. 
 
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) విద్యార్థి సంఘం నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఏఎంయూ స్నాతకోత్సవం ఈ నెల 7న జరగబోతోంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొనబోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘం రామ్‌నాథ్ కోవింద్‌ తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాకే ఏఎంయూలోకి అడుగుపెట్టాలని విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. 
 
ఈ మేరకు ఏఎంయూ విద్యార్థి సంఘం ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ మాట్లాడుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ అయినా చెప్పాలని, లేదంటే, స్నాతకోత్సవానికి గైర్హాజరు కావాలని తేల్చి చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు