పొగతాగిన విద్యార్థి.. చితకబాదిన టీచర్లు.. బీహార్‌లో విషాదం!

మంగళవారం, 27 జూన్ 2023 (14:37 IST)
బీహార్ రాష్ట్రంలో ఓ దారుణ ఘటన జరిగింది. తమ వద్ద చదువుకునే విద్యార్థి ఒకరు సిగరెట్ తాగడాన్ని కొందరు టీచర్లుచూశారు. దీంతో ఆగ్రహించిన ఉపాధ్యాయులు.. ఆ విద్యార్థిని పట్టుకుని చితకబాదారు. బెల్టుతో కొట్టారు. ఈ దెబ్బలకు తీవ్రంగా గాయపడిన ఆ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తూర్పు చంపారణ్ జిల్లా మధుబన్ ప్రాంతానికి చెందిన ఒక విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం రిపేర్‌కు ఇచ్చిన తన తల్లి మొబైల్‌ను తీసుకొచ్చేందుకు షాపుకు వెళ్ళాడు. తిరిగి వచ్చే క్రమంలో తన స్నేహితులతో కలిసి పొగతాగాడు. ఈ కుర్రోడు సిగరెట్ తాగడాన్ని స్కూల్ ఛైర్మన్ విజయ కుమార్ చూసి వెంటనే విద్యార్థి తండ్రిని స్కూలుకు పిలిపించి సమాచారం చెప్పాడు. ఆ తర్వాత విద్యార్థిని పాఠశాల ఆవరణలోకి ఈడ్చుకెళ్లి బెల్టుతో విచక్షణా రహితంగా కొట్టాడు. ఆ దెబ్బలు తాళలేని విద్యార్థి సొమ్ముసిల్లిపడిపోయాడు. 
 
పైగా, ఇతర టీచర్లు కూడా విద్యార్థిని చావబాదారు. దీంతో అతను అపస్మారకస్థితిలోకి జారుకోవడంతో సమీపంలోని ఒక ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ముజఫర్‌పూర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు. మెడ, చేతులతో పాటు విద్యార్థి ప్రైవేట్ భాగాల్లో కూడా తీవ్ర గాయాలు కావడంతో మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. స్థానిక పోలీసులు కేసు నమోదుచేసి ఛైర్మన్‌తో పాటు విద్యార్థిని కొట్టిన ఉపాధ్యాయులను అదుపులోకి తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు