నోటీస్ పీరియడ్ అవసరంలేదు, ఈరోజు నుంచి ఉద్యోగం మానేయండి: బైజుస్ లేఆఫ్

ఐవీఆర్

బుధవారం, 3 ఏప్రియల్ 2024 (17:17 IST)
ఎడ్‌టెక్ కంపెనీ బైజూస్ తీవ్ర ఆర్థిక ఆటుపోట్లకు గురవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయాచోట్ల పని చేస్తున్న ఉద్యోగులను క్రమంగా తొలగిస్తూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం పలువురు ఉద్యోగులను ఫోన్ కాల్‌లపై తొలగింపులను ప్రారంభించింది. పనితీరు మెరుగుదల ప్రణాళిక (పిఐపి-పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్)లో ఉద్యోగులను పరీక్షించకుండానే తొలగించే పనిలో వున్నట్లు తెలుస్తోంది. నోటీసు పీరియడ్ కూడా అవసరం లేదని సమాచారం.
 
బైజూ ప్రస్తుత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియలో కనీసం 100 నుండి 500 మంది వుంటారని తెలుస్తోంది. గత రెండేళ్ళలో, బైజూస్ కనీసం 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ నిధులు తగ్గిపోతున్నందున, పెట్టుబడిదారులు, వాటాదారులతో చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఆపరేటింగ్ నిర్మాణాలను సరళీకృతం చేయడానికి, వ్యయాలను తగ్గించడానికి, మెరుగైన నగదు ప్రవాహ నిర్వహణకు అక్టోబర్ 2023లో ప్రకటించిన వ్యాపార పునర్నిర్మాణ కార్యక్రమానికి సంబంధించి చివరి దశలో ఉన్నామని కంపెనీ అధికారి ఒకరు ప్రముఖ మీడియా సంస్థతో చెప్పారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి నిర్ణయాలను తీసుకుంటున్నట్లు తెలిపారు.
 
ప్రస్తుత తొలగింపుల్లో బైజూస్ ఇమెయిల్‌లతో కూడిన ఫోన్ కాల్‌ ద్వారా చేస్తోంది. నోటీస్ పీరియడ్ అవసరంలేదు, ఈరోజు నుంచి ఉద్యోగానికి రానవసంరలేదు. మీవద్ద వున్న కంపెనీ ఆస్తులను తక్షణమే అప్పగించండి. ఏమైనా మాట్లాడాలనుకుంటే ఇమెయిల్ ద్వారా తెలియజేయండి అంటూ బైజూస్ ఉద్యోగులకు తెలియజేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు