ఢిల్లీలో వర్షం దంచి కొడుతోంది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు విమానాలను దారి మళ్లిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన కుండపోతవర్షం కురిసింది. ఈ వర్షంతో వేసవి నుంచి ఢిల్లీ ప్రజలకు కొంతమేరకు ఉపశమనం లభించినట్టయింది. అయితే, రోజువారి దినచర్యలకు మాత్రం తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా, ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో అనేక లోతట్టు ప్రాంతాలన్ని జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, వర్షాల కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం కలిగింది. దాదాపు 100 విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో మరో 40 విమానాలను దారి మళ్లించినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రయాణికులకు ఎయిర్పోర్టు అడ్వైజరీ జారీచేసింది. అటు ఎయిరిండియా, ఇండిగో కూడా తమ ప్రయాణికులకు అలెర్ట్ సందేశాలు పంపించాయి. తాజా అప్డేట్ కోసం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి.
మరికొన్ని గంటల్లో ఢిల్లీలో ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో రాజధానికి రెడ్ అలెర్ట్ జారీచేసింది. గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఇప్పటికే తెల్లవారుజామున కురిసిన వర్షానికి లజ్పత్ నగర్, ఆర్కేపురం, ద్వారక తదితర ప్రాంతాల్లో వర్షపునీరు వచ్చి చేరింది. ఇటు హర్యానా రాష్ట్రంలోనూ భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఊహించని వాతావరణ మార్పులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.