మణిపూర్‌లో దారుణం : స్వాతంత్ర్య సమరయోధుడి భార్య సజీవదహనం

ఆదివారం, 23 జులై 2023 (13:41 IST)
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ రాష్ట్రంలో మరో అరాచక ఘటన వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను ఓ సాయుధ మూక సజీవ దహనం చేసింది. ఈ దారుణం కాక్చింగ్‌ జిల్లా సెరో గ్రామంలో జరిగింది. స్వాతంత్ర్య సమరయోధుడు ఎస్‌ చురాచాంద్‌ సింగ్‌ భార్య సోరోకైబామ్‌ ఇబెటోంబి(80)ని సజీవ దహనం చేశారు. ఆమె భర్త చురచాంద్‌ సింగ్‌.. గతంలో అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలామ్‌ నుంచి సత్కారం స్వీకరించారు. 
 
ఈ ఘటన మే 28 తెల్లవారుజామున చోటు చేసుకొన్నట్లు ఆంగ్లపత్రికల్లో కథనాలు వెలువడుతున్నాయి. ఆ రోజు గ్రామంలో భారీగా హింస చోటు చేసుకొంది. కాల్పులు కూడా జరిగాయి. ఆ సమయంలో తన ఇంట్లో ఉన్న 80 ఏళ్ల ఇబెటోంబిపై సాయుధ దుండగులు దాడి చేసి, ఇంటి బయట గడియ పెట్టి, ఆ తర్వాత ఇంటికి నిప్పు పెట్టారు.
 
ఆమెను రక్షించేందుకు కుటుంబీకులు అక్కడికి చేరుకొనేసరికే.. ఇల్లు మొత్తం కాలిపోయింది. ఈ విషయాన్ని ఇబెటోంబి మనవడు ప్రేమ్‌కాంత వెల్లడించాడు. ఆ సమయంలో తాను కూడా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో తప్పించుకొన్నట్లు వెల్లడించాడు. తమపై కూడా కాల్పులు జరిగాయని.. కొన్ని తూటాలు చెయ్యి, కాలులో దూసుకుపోయాయని చెప్పాడు. 
 
ఇంఫాల్‌కు 45 కిలోమీటర్ల దూరంలోని ఈ గ్రామం రాష్ట్రంలో హింస ప్రారంభానికి ముందు చాలా సుందరంగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామంలో కాలిన గృహాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. చాలా ఇళ్ల గోడలపై తూటాలు దర్శనమిస్తున్నాయి. కుకీ-మైతేయ్‌ ఘర్షణల్లో అత్యంత దారుణంగా దెబ్బతిన్న గ్రామాల్లో ఇది కూడా ఒకటి. ఇబెటోంబి అస్థికలు ఇప్పటికీ అక్కడే పడి ఉన్నట్లు మీడియా సంస్థలు చెబుతున్నాయి. ఈ గ్రామం నుంచి ప్రజలు ప్రాణాలు దక్కించుకొనేందుకు పారిపోయారు. ప్రస్తుతం ఇది నిర్మానుష్యంగా మారిపోయింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు