యాస్ రూపంలో మరో ముప్పు... అప్రమత్తమైన కేంద్రం

ఆదివారం, 23 మే 2021 (19:35 IST)
తౌక్టే తుపాను విలయం నుంచి కోలుకోక ముందే ‘యాస్‌’ రూపంలో మరోముప్పు ముంచుకొస్తోంది. తాజాగా తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో కేంద్రం అప్రమత్తమైంది. 
 
‘యాస్‌’ తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జాతీమ విపత్తు నిర్వహణ సంస్థ, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తుపాను సమయంలో ముప్పు ప్రాంతాల ప్రజలతోపాటు ఇప్పటికే కొవిడ్‌ చికిత్స తీసుకుంటున్న బాధితులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ప్రధాని మోదీ సూచించారు.
 
తూర్పు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈ నెల 24న తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26న సాయంత్రం ఒడిశా-పశ్చిమబెంగాల్‌ మధ్య తీరాన్ని తాకవచ్చని పేర్కొంది. ఈ తుపాను ప్రభావం ఒడిశా, పశ్చిమబెంగాల్‌, బంగ్లాదేశ్‌పై అధికంగా ఉండవచ్చని అంచనా వేసింది. యాస్‌ తుపానుపై వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. 
 
ఈ నేపథ్యంలో యాస్‌ తుపాను సన్నద్ధత, ముందస్తు జాగ్రత్త చర్యలపై ప్రధాని మోదీ వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ అధికారులతో పాటు టెలికాం, విద్యుత్‌, పౌరవిమానయాన శాఖల అధికారులు పాల్గొన్నారు. వర్చువల్‌ పద్ధతిలో జరిగిన ఈ సమావేశానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కూడా హాజరయ్యారు.
 
యాస్‌ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఎన్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు భారత సైన్యం కూడా సిద్ధమైంది. ఇప్పటికే 46ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఆయా ప్రాంతాల్లో సిద్ధంగా ఉండగా.. మరో 13 బృందాలు చేరుకోనున్నాయి. ఇక ఒడిశా, బెంగాల్‌ రాష్ట్రాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌తో భారత వాయుసేన సిద్ధంగా ఉంది. తుపాను ముందస్తు హెచ్చరికలతో అటు ఈశాన్య రైల్వే కూడా పలు సర్వీసులను రద్దుచేసింది. దిల్లీ నుంచి భువనేశ్వర్‌, పూరీల మధ్య నడిచే రైళ్లను అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు