పెళ్లి చేసుకుంటే అత్యాచార నేరం సమసిపోద్దా?

బుధవారం, 3 మార్చి 2021 (11:45 IST)
ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ.బాబ్డే చేసిన వ్యాఖ్యలపై సిపిఎం పొలిట్‌బ్యురో సభ్యురాలు బృందాకరత్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లి చేసుకుంటే అత్యాచార నేరం సమసిపోద్దా? అని అన్నారు. తక్షణమే ఆ వ్యాఖ్యలను, నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని కోరారు.

ఈ మేరకు బృందాకరత్‌ మంగళవారం బాబ్డేకు ఒక లేఖ రాశారు. మొదటి కేసులో, మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి బెయిల్‌ తిరస్కరిస్తూ ఔరంగాబాద్‌ బెంచ్‌ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా నిందితుడు అప్పీల్‌ చేసుకున్నాడు. దానిపై విచారణ సందర్భంగా బాబ్డే ''ఆమెను నీవు వివాహం చేసుకుంటావా?'' అని ప్రశ్నించారు.

పైగా ప్రభుత్వ ఉద్యోగి అయివుండి ఇలాంటి చర్యలకు పాల్పడే ముందు ఆలోచించాలి, నీకు ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశముంటే ఆ విషయమై దృష్టిసారిస్తామంటూ వ్యాఖ్యానించారు. పైగా ఆ వ్యక్తికి అరెస్టు నుంచి నాలుగు వారాల పాటు రక్షణ కల్పిస్తూ..రెగ్యులర్‌ బెయిల్‌ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఈ కేసులో ఆయన ప్రశ్నలు, వ్యాఖ్యలు, చర్యలన్నీ మైనర్లపై అత్యాచారాలకు పాల్పడే వారు దాఖలు చేసుకునే బెయిల్‌ పిటిషన్లపై తీవ్ర ప్రభావం కలిగించేలా ఉన్నాయని బృందాకరత్‌ అన్నారు. ఔరంగాబాద్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించాలని కోరారు.

పైగా 16 ఏళ్ల వయసులో అత్యాచారానికి గురైన ఆ బాలికపై దాదాపు 12సార్లు ఇదే అకృత్యానికి ఆ కీచకుడు పాల్పడ్డాడని ఆమె తెలిపారు. ప్రస్తుతం 18 ఏళ్ల వయసున్న ఆమె ఇన్నాళ్లుగా అనుభవించిన బాధ, వేదన, కష్టాలు వేటికీ విలువ లేదా? వారికి ఎలాంటి మనోభావాలు వుండవా? అని బృందాకరత్‌ ప్రశ్నించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు