మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ ఆటో డ్రైవర్ అమానుషంగా ప్రవర్తించాడు. జరిమానా తప్పించుకోవడానికి ఆటోను ఆపకుండా తీసుకెళ్లాడు. అడ్డుపడిన మహిళా కానిస్టేబుల్ను ఈడ్చుకుంటూ వెళ్లిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు వెంటపడి ఆటోను నిలిపివేశారు. ఆ తర్వాత డ్రైవర్ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సతారా నగరంలోని ఓ కూడలి వద్ద సోమవారం ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఇంతలో అటుగా వచ్చిన ఓ ఓటోను మహిళా కానిస్టేబుల్ భాగ్యశ్రీ జాదవ్ ఆపేందుకు ప్రయత్నించారు. అయితే, మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దేవ్ రాజ్ కాలే ఆటోను ఆపలేదు.
పైగా, అడ్డుపడిన భాగ్యశ్రీ జాదవ్ను ఈడ్చుకుంటూ వెళ్లాడు. దీంతో స్థానికులు ఆటోను వెంబడించి కొద్దిదూరంలో దానిని ఆపి, డ్రైవర్ను చితకబాదారు. ఆటో డ్రైవర్ దేవ్ రాజ్ కాలేను అదుపులోకి తీసుకున్నామని, భాగ్యశ్రీ జావద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.