మనీలాండరింగ్ కోణంలో కేరళ సీఎం కుమార్తె ఐటీ కంపెనీపై కేసు నమోదు!!

వరుణ్

గురువారం, 28 మార్చి 2024 (08:49 IST)
కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్‌పై కేసు నమోదైంది. ఓ మైనింగ్ కంపెనీ నుంచి సీఎం కూతురికి చెందిన ఐటీ సంస్థకు నిధులు చేరాయంటూ ఆరోపణలు వచ్చాయి. వీటిని గత యేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ లేవనెత్తారు. ఈ ఘటనపై ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు రంగలోకి దిగిన మనీలాండరింగ్ కోణంలో సీఎం కుమార్తె ఐటీ కంపెనీపై కేసు నమోదు చేశారు. వీణా విజయన్‌కు చెందిన ఐటీ సంస్థతో పాటు కొచ్చిన్‌లోని గనుల సంస్థ సీఎంఆర్ఎల్‌పై కూడా ఈడీ దర్యాప్తు జరుపుతుంది. ఈ మేరకు ఈసీఐఆర్‌ను దాఖలు చేసింది. మరోవైపు, ఈ ఉదంతంపై సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కూడా దర్యాప్తు చేస్తుంది. 
 
గత యేడాది కాంగ్రెస్ ఎమ్మెల్యే మ్యాథ్యూ కుజల్ నదన్ వీణ ఐటీ సంస్థ ఎక్సా‌లాజిక్‌పై చేరిన ఫిర్యాదులతో ఎస్ఎఫ్ఐఓ రంగంలోకి దిగింది. సీఎంఆర్ఎల్ మైనింగ్ సంస్థ నుంచి ఎక్సాలాజిక్కు రూ.1.7 కోట్ల నిధులు అందాయని మ్యాథ్యూ ఆరోపించారు. ఇక సీఎంఆర్ఎల్ సంస్థలో కేరళ రాష్ట్ర ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ 13 శాతం వాటా ఉంది. ఈ నేపథ్యంలో సీఎంఆర్ఎల్ సంస్థతో పాటు కేఎస్‌ఐడీసీ అధికారులను కూడా ఎస్.ఎఫ్.ఐ.ఏ ప్రశ్నించింది. వారి వివరణలను రికార్డు చేసుకుంది. 
 
అయితే, ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తును నిలుపుదల చేయాలంటూ అప్పట్లో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన కేఎస్ఐడీసీకి చుక్కెదురైంది. దర్యాప్తు నిలుపుదల కోరుతూ మరో పిటిషన్ వేసిన ఎక్సాలాజిక్‌కు కూడా న్యాయస్థానంలో ఊరట దక్కలేదు. కాగా, సార్వత్రిక ఎన్నికల సమరం వేళ కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై బీజేపీ నేతల ప్రోద్భలంతోనే కేసు నమోదు చేశారంటూ వామపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు