జయ స్నేహితురాలి శశికళ బినామీ ఆస్తుల జప్తుకు రంగం సిద్ధం

ఆదివారం, 29 అక్టోబరు 2017 (11:17 IST)
ఆదాయానికి మించి ఆస్తుల సంపాదన కేసులో దోషిగా తేలి బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే మాజీ ప్రధాన కార్యదర్శి వీకే శశికళ బినామీ ఆస్తుల జప్తునకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం చర్యలు చేపట్టింది. 
 
నల్లధనాన్ని అరికట్టే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైన చర్యలు చేపడుతోంది. ఇందులోభాగంగా దేశంలో పెద్ద విలువ కలిగిన నోట్లను రద్దు చేసింది. అలాగే, నకిలీ కంపెనీల జాబితాను కూడా తయారు చేసింది. ఇలా తయారు చేసిన జాబితాలో దేశంలో మూడు లక్షల నకిలీ కంపెనీలు ఉన్నట్టు గుర్తించింది. 
 
ఈ కంపెనీల పేరిట పలువురు రూ.1.321 లక్షల కోట్లు డిపాజిట్ చేసినట్టు ఇటీవల గుర్తించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వీటిలో 2.2 లక్షల కంపెనీల గుర్తింపును రద్దు చేసింది. అంతేకాక ఆయా కంపెనీలకు డైరెక్టర్లుగా ఉన్న వారిపై ఐదేళ్ల నిషేధం విధించింది. ఈ కాలంలో వీరు ఇతర కంపెనీల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహించకుండా ఆంక్షలు విధించింది.
 
ఇలా నిషేధం విధించి వారి జాబితాలో శశికళ కూడా ఉన్నారు. ఆమె నకిలీ కంపెనీల్లో ఫ్యాన్సీ స్టీల్స్, రెయిన్‌బో ఎయిర్, సుక్రా క్లబ్, ఇండో-దోహా పెట్రో కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ తదితర కంపెనీలున్నాయి. వీటి ఆస్తులను గుర్తించాల్సిందిగా ఆదేశించిన కేంద్రం వాటి స్వాధీనానికి రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు